AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 2 Mains Exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఫిబ్రవరి 23న పరీక్ష యథాతథం

ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరికీ తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. మెయిన్స్‌ పరీక్షకు 92,250 మంది అర్హత సాదిస్తే.. కేవలం ఇద్దరి కోసం పరీక్ష వాయిదా వేయలేమని చెప్పింది..

APPSC Group 2 Mains Exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఫిబ్రవరి 23న పరీక్ష యథాతథం
AP High Court
Srilakshmi C
|

Updated on: Feb 21, 2025 | 8:04 AM

Share

అమరావతి, ఫిబ్రవరి 21: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం ప్రధాన పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరి ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. మెయిన్స్‌ పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారని, అందులో కేవలం ఇద్దరు మాత్రమే హారిజాంటల్‌ రిజర్వేషన్‌పై అభ్యంతరం తెలుపుతూ పరీక్షలు నిలిపేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్లు ఈ వ్యాజ్యంలో విజయం సాధిస్తే, అప్పుడు మొత్తం ప్రక్రియను మొదటి నుంచి తిరిగి ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అంతేకాకుండా మెయిన్స్‌ పరీక్షను నిలిపేస్తే అనేక మంది అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతుందని, అందువల్లే ఈ పరీక్షను నిలుపుదల చేయలేమని పేర్కొంది.

అయితే ఈ వ్యాజ్యాల్లో వెలువరించే తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో 10 రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగి పోయినట్లైంది. ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్‌ 2 మెయిన్‌ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్‌పీలను ఆయన ఆదేశించారు.

మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్‌ 1 రాత పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్‌ 2 పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్‌కు అభ్యర్థులు ఉదయం.9.30 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9.45 గంటలకు గేట్లను మూసివేస్తారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన ఎవ్వరినీ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.