AP EAPCET Results 2026: విద్యార్ధులకు తప్పని ఎదురు చూపులు.. EAPCET ఫలితాలు మళ్లీ వాయిదా..?
AP EAPCET Results 2026 postponed: రాష్ట్ర ఈఏపీసెట్ 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు జూన్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, సీబీఎస్ఈ ఫలితాల ప్రక్రియ పూర్తయ్యాక ర్యాంకులను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంతో ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా ఫలితాల విడుదల..

అమరావతి, జూన్ 21: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలోని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు జూన్ చివరి వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈఏపీసెట్సెట్ ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
మే 12 నుంచి 20 వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిదే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల కోసం వాయిదా వేశారు. ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ర్యాంకులు కేటాయించాలంటే ఇంటర్మీడియట్ మార్కులూ తప్పనిసరి. పైగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఇంటర్ విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అవకాశం కల్పించింది. లక్షకుపైగా విద్యార్థులు తమ మార్కుల మెరుగుదలకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్ ర్యాంకుల్లో వీరికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫలితాలను వాయిదా వేసింది.
జూన్ 18న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఒకట్రెండు రోజుల్లో ఎప్సెట్ ర్యాంకులూ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఈఏపీసెట్ ఫలితాల విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. సీబీఎస్ఈ రివైడ్జ్ ఫలితాలను ఈ నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్సెట్ ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదని విద్యాశాఖ భావిస్తుంది. అందువల్ల సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలైన తర్వాత ఈఏపీసెట్ ర్యాంకులను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.




