Talliki Vandanam Scheme: ఆ వార్తలు నమ్మకండి.. ‘తల్లికి వందనం’ మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదు: పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి విద్యాశాఖ తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. ఈ పథకం గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై స్పష్టత నిచ్చింది. ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారనే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుందని..
![Talliki Vandanam Scheme: ఆ వార్తలు నమ్మకండి.. ‘తల్లికి వందనం’ మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదు: పాఠశాల విద్యాశాఖ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/talliki-vandanam-schem.jpg?w=1280)
అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి విద్యాశాఖ తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. ఈ పథకం గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై స్పష్టత నిచ్చింది. ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారనే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుందని అన్నారు. ఇందులో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు. కొన్నిపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, వాటిని నమ్మొద్దని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ శాఖలు ఏ పథకాలకైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించుకోవాల్సి వస్తే గెజిట్ పబ్లికేషన్ చేసి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యూఐడీఏఐ అనుమతులు పొందాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆధార్ సేవలు వినియోగించుకునేందుకే ఉత్తర్వులు 29 విడుదల చేశామని ఆయన వెల్లడించారు.
కాగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి అమ్మ ఒడి పథకం స్థానంలో అమ్మకు వందనం పధకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘అమ్మకు వందనం’తోపాటు, ‘స్టూడెంట్ కిట్’ పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొంటూ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. అయితే ఒకవేళ లేకపోతే ఆధార్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్ వచ్చే వరకూ 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని, వాటి వివరాలను వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే ఇంట్లో ఎందరు పిల్లలు చదువుతుంటే అందరికీ ఆర్ధికసాయం ఇస్తామని కూటమి సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా.. ప్రభుత్వం చేపట్టిన తర్వాత పిల్లలకు కాకుండా ఒక్కొక్క తల్లికి మాత్రమే రూ.15 వేల ఆర్ధిక సాయం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై తాజాగా పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. అమ్మకు వందనం పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు విధివిధానాలను మాత్రమే జారీ చేశామని, మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వెల్లడించారు.