TRAI Orders: స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేలా ట్రాయ్ కీలక చర్యలు.. టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీ
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి చిన్న అవసరానికి ఫోన్ తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. అయితే పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని మోసం చేసే వారి సంఖ్య పెరిగింది. మోసపూరిత కాల్స్ ద్వారా మన సమాచారాన్ని తస్కరించడంతో పాటు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇలాంటి మోసపూరిత కాల్స్కు చెక్ పెట్టేలా ట్రాయ్ చర్యలు తీసకుంది.

టెలికం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అలాగే వినియోగదారుల భద్రతను పెంచడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను సవరించింది. స్పామ్ కాల్స్ గుర్తింపును మెరుగుపరచడంతో పాటు టెలికం ఆపరేటర్లను జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ట్రాయ్ టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018ను ఇటీవల సవరించారు. ముఖ్యంగా పది అంకెల ఫోన్ నెంబర్స్తో చేసే మోసాల అరికట్టేలా రూల్స్ను సవరించింది. ఈ సవరణలు నమోదుకాని టెలిమార్కెటర్ల (యూటీఎం)పై నిబంధనలను కఠినతరం చేస్తాయి. ముఖ్యంగా వినియోగదారుల ఫిర్యాదుమేరకు టెలికం కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేసింది.
ట్రాయ్ తాజా సవరణల ప్రకారం ప్రామాణిక 10 అంకెల మొబైల్ నంబర్ల ద్వారా వాణిజ్య వినియోగాన్ని పరిమితం చేసింది. టెలిమార్కెటర్లు నియమించిన నంబర్ల శ్రేణిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ‘140’ సిరీస్ ప్రమోషనల్ కాల్స్ కోసం, కొత్తగా కేటాయించిన ‘1600’ సిరీస్ లావాదేవీలు, కాల్స్ సర్వీస్ కోసం ఉపయోగించాలి. అలాగే స్పామ్ కాల్స్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసే ప్రక్రియను కూడా సరళీకరించారు. గతంలో మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటే ఇప్పుడు దానిని ఏడు రోజులకు పెంచారు. గతంలో టెలికం ఆపరేటర్లు యూసీసీ ఫిర్యాదులపై 30 రోజుల్లోపు చర్య తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు వారు 5 రోజుల్లోపు కచ్చితంగా ఫిర్యాదులను పరిష్కరించాలి. టెలికం కంపెనీలకు జరిమానా విధించే పరిమితిని ఏడు రోజుల్లో 10 ఫిర్యాదుల నుంచి 10 రోజుల్లోపు కేవలం ఐదు ఫిర్యాదులకు తగ్గించారు.
ముఖ్యంగా టెలికం కంపెనీలు ఇప్పుడు వినియోగదారులు తమ మొబైల్ యాప్లు మరియు వెబ్సైట్లలో ఫిర్యాదు నమోదు చేసే సౌకర్యాన్ని కూడా అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. అలాగే ట్రాయ్ పదేపదే నేరం చేసేవారికి కఠినమైన శిక్షలను పేర్కొంది. మొదటిసారి ఉల్లంఘించిన వారు 15 రోజుల పాటు అవుట్గోయింగ్ టెలికాం సేవలను నిలిపివేస్తారు. వారు మళ్ళీ నేరాన్ని పునరావృతం చేస్తే వారి టెలికం వనరులు అంటే పీఆర్ఐ/ఎస్ఐపీ ట్రంక్లు సహా అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఒక సంవత్సరం పాటు డిస్కనెక్ట్ చేసి, ఆ తర్వాత బ్లాక్లిస్ట్ చేస్తారు. అలాగే గ్రాయ్ మొదటి ఉల్లంఘనకు రూ.2 లక్షలు, రెండోసారి రూ.5 లక్షలు, మూడో సారి చేస్తే రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని నూతన రూల్స్లో స్పష్టంగా పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి