Union Budget: పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్ చెబుతారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై నెలలో బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై పన్నుచెల్లింపుదారులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తమకు ఊరట లభించే అంశాలపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఈసారి కేంద్రబడ్జెట్ లో సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిని పెంచాలని పలువురు ఆర్థిక నిపుణులు కోరుతున్నారు.
![Union Budget: పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్ చెబుతారా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/union-budget-2024.jpg?w=1280)
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై నెలలో బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై పన్నుచెల్లింపుదారులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తమకు ఊరట లభించే అంశాలపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఈసారి కేంద్రబడ్జెట్ లో సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిని పెంచాలని పలువురు ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట కలగడంతో పాటు దేశ ప్రగతికి కూడా దోహదపడుతుందన్నారు.
సెక్షన్ 80సీ అంటే..
సాధారణంగా ఆదాయంపై పన్నును ఆదా చేసేందుకు చాలామంది పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80సీని ఎంచుకుంటారు. అయితే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీ ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ), ఈఎల్ఎస్ఎస్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టిన వారికి రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. 2014లో దివంగత అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితిని నిర్ణయించారు. మళ్లీ ఇప్పటి వరకూ మార్చలేదు. పెరిగిన ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు, ఇతర ఆర్థిక బాధ్యతల నేపథ్యంలో ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ పెరుగుతోంది.
ప్రయోజనాలు ఇవే..
ఆదాయపు పన్నుసెక్షన్ 80సీ పరిమితిని పెంచడం వల్ల పన్ను చెల్లింపుదారులతో పాటు దేశానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పన్ను చెల్లింపుదారులకు సాయపడుతుంది. ఈఎల్ఎస్ఎస్,పన్ను ఆదా చేసే ఎఫ్ డీలు, పీపీఎఫ్ తదితర వాటిలో పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. అధిక మినహాయింపు పరిమితి పన్ను భారాలను తగ్గిస్తుంది. పరిమితిని పెంచడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక భద్రత కలుగుతుంది. దీర్ఘకాలిక పొదుపులు, పెట్టుబడులు పెరుగుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్లు (ఈఎల్ఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) తదితర వాటిలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. బీమా, జీవిత బీమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు తదితర రంగాలలో పెట్టుబడులు పెరుగుతాయి. ద్రవ్యోల్బణ సమయంలో ఆదాయ అసమానతను కూడా పరిష్కరిస్తుంది.
మినహాయింపులు..
పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 80సీ కింద ఈ కింద తెలిపిన మార్గాలలో మినహాయింపులు లభిస్తాయి.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
- ట్యూషన్ ఫీజు
- ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్
- జీవిత బీమా పాలసీల ప్రీమియం
- ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు (ఈఎల్ఎస్ఎస్) మ్యూచువల్ ఫండ్స్
- హౌసింగ్ లోన్పై ప్రిన్సిపాల్ రీపేమెంట్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..