Indian Railways: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్న్యూస్! కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చిన రైల్వే శాఖ
తిరుపతి–చర్లపల్లి మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలును క్రమబద్ధీకరిస్తూ, కొత్తగా 17443/17444 వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. మే 28 నుంచి ఈ సేవలు ప్రారంభం కానుండగా, రాయలసీమ–హైదరాబాద్ ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

తిరుపతి వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న 07002/07031 తిరుపతి–చర్లపల్లి–తిరుపతి వీక్లీ స్పెషల్ రైలును క్రమబద్ధీకరిస్తూ, దాని స్థానంలో కొత్తగా 17443/17444 నంబర్లతో వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సేవలు మే 28, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. రైలు నెం.17443 తిరుపతి–చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 17444 చర్లపల్లి–తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుకోనుంది.
ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది మరింత సౌకర్యవంతమైన రైలు సేవగా మారనుంది.
రైలు కూర్పులో 1 ఏసీ 2-టియర్, 3 ఏసీ 3-టియర్ కోచ్లు, 14 స్లీపర్ క్లాస్ బోగీలు, అలాగే 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉండనున్నాయి. దీంతో సాధారణ ప్రయాణికుల నుంచి దీర్ఘదూర ప్రయాణికుల వరకు అందరికీ అనుకూలంగా ఉండేలా రైలును రూపొందించారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలతో తిరుపతి–హైదరాబాద్ మార్గంలో ప్రయాణికుల రద్దీ కొంత మేర తగ్గడంతో పాటు, రాయలసీమ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
