Petrol: రూపాయికే లీటర్ పెట్రోల్.. రూ.100కే కారు ఫుల్ ట్యాంక్.. ఎక్కడో తెలుసా..?
భారత్లో లీటరు పెట్రోల్ రూ. 100 దాటితేనే బండి బయటకు తీయాలంటే భయపడిపోతాం. కానీ ఆ దేశంలో మాత్రం కేవలం ఒక్క రూపాయికే లీటరు పెట్రోల్ లభిస్తుంది. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అపారమైన చమురు సంపదతో ప్రపంచానికే రారాజుగా వెలుగొందుతున్న ఆ దేశంలో ఇప్పుడు పెను రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. దక్షిణ అమెరికాలోని చమురు సంపన్న దేశం వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు శనివారంకరాకస్లో అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఆయనను న్యూయార్క్కు తరలించి మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో-టెర్రరిజం వంటి తీవ్ర ఆరోపణలపై మదురో ఇప్పుడు అమెరికాలో విచారణను ఎదుర్కోబోతున్నారు.
చమురు నిల్వలపై కన్ను.. సైనిక చర్య వెనుక మర్మం?
వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ చమురు నిల్వలు కలిగిన దేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయని అంచనా. సౌదీ అరేబియా కంటే వెనిజులాలోనే అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మదురో ప్రభుత్వంపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఈ సైనిక చర్య ద్వారా వెనిజులాలోని అపారమైన ఇంధన వనరులపై నియంత్రణ సాధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్
భారతదేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటుతుంటే, వెనిజులాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పెట్రోల్ ధర ఒక చాక్లెట్ కంటే తక్కువ. వెనిజులాలో సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పెట్రోల్ ధర లీటరుకు కేవలం రూ. 1 నుండి రూ. 3 మాత్రమే. అక్కడ మీ బైక్ లేదా కారు ట్యాంక్ నింపడానికి కేవలం రూ. 50 నుండి రూ. 150 ఖర్చు చేస్తే సరిపోతుంది. అక్కడ రెండు రకాల రేట్లు ఉంటాయి. ఒకటి సామాన్యుల కోసం ఇచ్చే సబ్సిడీ ధర, రెండోది అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉండే ప్రీమియం పెట్రోల్. ప్రీమియం పెట్రోల్ ధర కూడా భారత్తో పోలిస్తే చాలా తక్కువ. కేవలం రూ.42 మాత్రమే ఉంటుంది.
చమురు ప్రపంచంలో రారాజులు
- వెనిజులా – 303 బిలియన్ బ్యారెళ్లు
- సౌదీ అరేబియా – 267.2 బిలియన్ బ్యారెళ్లు
- ఇరాన్ – 208.6 బిలియన్ బ్యారెళ్లు
- కెనడా – 163.6 బిలియన్ బ్యారెళ్లు
కోర్టులో మదురో ఏమన్నారంటే?
న్యూయార్క్ కోర్టులో హాజరైన మదురో తాను నిర్దోషినని వాదించారు. అమెరికా తనను అక్రమంగా కిడ్నాప్ చేసిందని, తాను ఇప్పటికీ వెనిజులాకు చట్టబద్ధమైన అధ్యక్షుడినని తెలిపారు. మరోవైపు వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈ చర్యను అనాగరికం అని అభివర్ణించారు. ఈ పరిణామం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను, రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




