Telangana: అయ్యో బిడ్డా.. విషాదంగా ముగిసిన ప్రేమ కథ.. అసలు ఏం జరిగిందంటే..?
ప్రేమించి పెళ్లాడమంటే ప్రాణం పోయేలా చేశాడు. ప్రాణంగా ప్రేమించినవాడే పెళ్లికి నిరాకరించి, వ్యక్తిత్వాన్ని శంకించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందింది. చివరకు ఎవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఈ ప్రేమ కథా విషాదాంతం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. ప్రాణంగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి తన ప్రాణాన్నే తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు చావుకు కారణమైన యువకున్ని అరెస్ట్ చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అశ్వాపురానికి చెందిన నందకిషోర్ అనే యువకుడు, సరస్వతీ అనే యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదువు పూర్తి చేసుకున్న నందకిషోర్ హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా డిగ్రీ పూర్తి చేసిన సరస్వతి అక్కడే కాల్ సెంటర్లో టెలికాలర్గా పని చేస్తుంది. ఈ క్రమంలోనే నందకిషోర్ని పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు సరస్వతి గత కొంతకాలంగా అడుగుతుంది. పెళ్లి విషయానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది..
నూతన సంవత్సర వేడుకల కోసం అశ్వాపురంలోని తన ఇంటికి వచ్చిన సరస్వతి శనివారం నాడే హైదరాబాదుకు తిరిగి వెళ్ళింది. ఆదివారం నాడు నందకిషోర్ సరస్వతీల మధ్య మరో మరో పెళ్లికి సంబంధించిన చర్చ జరగడం ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తల్లిదండ్రులు చెబుతుతున్నారు. ఈ క్రమంలోనే నందకిషోర్ పెళ్లికి నిరాకరించాడని అంతేకాకుండా మరో యువకుడితో తిరుగుతున్నావంటూ యువతిని అసభ్యకరంగా తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపం చెందిన సరస్వతి ఆదివారం నాడు హైదరాబాద్ మీర్పేట్ లోని తాను ఉంటున్న హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ హాస్టల్లో సరస్వతి ఆత్మహత్యపై అశ్వాపురంలోని ఆమె చెల్లికి హాస్టల్ నిర్వాహకులు సమాచారం అందించారు. తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చావుకు నందకిషోర్తో పాటు సరస్వతి రూమ్మెంట్ కూడా కారణమని సరస్వతి చెల్లి ఆరోపిస్తుంది. నందకిషోర్పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వాపురంలోని నందకిషోర్ ఇంటి ఎదుట సరస్వతి మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువతి మృతికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




