Gold Prices: బంగారం ధరలు మరింత చౌక.. త్వరలో మరోసారి భారీ పతనం..! కారణం ఏంటంటే..?
బంగారం ధరలు గత వారం రోజులుగా కుప్పకూలుతూనే ఉన్నాయి. రోజురోజుకి పడిపోతూ కొనుగోలుచేసేవారికి ఊరట కల్గిస్తున్నాయి. అయితే గోల్డ్ రేట్లు రానున్న రోజుల్లో మరింత తగ్గిపోతాయనే వార్తలు వస్తున్నాయి. దీనికి పలు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పడిపోతూ వస్తోన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం, పశ్చిమాసియాలో దారుణ పరిస్థితుల క్రమంలో కూడా ఊహించని విధంగా పసిడి ధరలు తగ్గడం చాలామంది పెట్టుబడిదారులను ఆయోమయంలో పడేస్తోంది. సాధారణంగా యుద్ద పరిస్థితుల క్రమంలో ధరలు పెరుగుతాయి. కానీ ఈ సారి సీన్ రివర్స్ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. యుద్ద సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల్లోకి తన డబ్బులను తరలిస్తారు. దీని వల్ల పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఈ సారి చమురు ధరలు పెరగడం, యుద్ద ప్రభావం క్రమంలో కొంతమంది పెట్టుబడిదారులు బంగారం, వెండిని విక్రయించడానికి ప్రేరేపించాయి.
లాభాల బుకింగ్
బంగారం ధరలు తగ్గడానికి లాభాల బుకింగ్ ఒక కారణంగా తెలుస్తోంది. ఇటీవల సంక్షోభం క్రమంలో బంగారం పెరగడం వల్ల చాలమంది పెట్టుబడిదారులు లాభాలు పొందారు. ఆ తర్వాత ముడి చమురు ధరలు పెరగడంపై స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని విక్రయించి ఇతర చోట్ల నష్టాలను భర్తీ చేశారు. బంగారం ధరల తగ్గుదలకు ఇదొక కారణంగా చెప్పవచ్చు.
డాలర్ బలపడటం
ఇక డాలర్ బలపడటం కూడా గోల్డ్ రేట్లు కుప్పకూలడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. డాలర్ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు పసిడి మరింత ఖరీదు అవుతుంది. ఇక యూఎస్ ట్రెజరీ రాబడి పెరగడం వల్ల బంగారం వంటి రాబడి లేని ఆస్తుల ఆకర్షణను తగ్గిస్తుంది. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కొతను ఆలస్య చేస్తోందనే అంచనాలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో పసిడి ధరలపై దీని ప్రభావం పడుతుంది.
సెంట్రల్ బ్యాంకుల సెంటిమెంట్
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని విక్రయించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. మార్కెట్లలో ఒత్తిడి నెలకొన్నప్పుడు లిక్విడిటీని పెంచుకోవడానికి సెంట్రల్ బ్యాంకులు తమ గోల్డ్ నిల్వల్లో కొంత భాగాన్ని విక్రయించుకుంటూ ఉంటాయి. ఇది జరిగితే మార్కెట్ సరఫరా పెరుగుతోంది. డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ ధరలపై ఒత్తిడి తెచ్చే అవకాముంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రామలు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,61,680గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,48,200గా ఉంది. ఇక వెండి ధర రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ధరలు మరింత తగ్గే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.
