AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్.. రూ.3,716 కోట్ల విలువ చేసే ఇల్లు జప్తు..

అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాకిచ్చింది. బుధవారం ముంబైలోని ఆయన విలాసవంతమైన ఇంటిని ఈడీ జప్తు చేసింది. అలాగే ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వేల కోట్ల విలువ చేసే ఇంటిని అటాచ్ చేసింది.

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్.. రూ.3,716 కోట్ల విలువ చేసే ఇల్లు జప్తు..
Ed Anil Ambani
Venkatrao Lella
|

Updated on: Feb 25, 2026 | 7:44 PM

Share

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాకిచ్చింది. ఆయన ఇంటికి ఈడీ అటాచ్ చేసింది. అడోబ్ అని పిలవబడే రూ.3,716 కోట్ల విలువ చేసే ఇంటిని అటాచ్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ గ్రూపు కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడు కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్ బ్యాంకు మోసం కేసులో దర్యాప్తులో భాగంగా తాజాగా అనిల్ అంబానీ ఇంటిని జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఫిబ్రవరి 26న విచారణకు రావాలని ఆయనను ఆదేశించిది. ఇప్పటివరకు కేసు దర్యాప్తుల్లో భాగంగా ఈడీ రూ.12 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

17 అంతస్తులతో ఇల్లు

ప్రస్తుతం ఈడీ జప్తు చేసిన ఇల్లు ముంబైలోని పాలి హిల్ ఏరియాలో ఉంటుంది. దీనిని 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తున నిర్మించారు. బుధవారం జప్తు చేయడంతో అనిల్ అంబానీకి పెద్ద షాక్ తగిలినట్లు అయింది. అనిల్ అంబానీ ఇంతకుముందు ఒకసారి మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరవ్వగా.. రేపు హాజరైతే రెండోసారి అవుతుంది. మొదటిసారి ఆగస్టు 2025లో ఈడీ ఆయనను విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఆయన స్టేట్ మెంట్ ఆధారంగా పీఎం‌ఎల్‌ఏ కింద కేసు నమోదు చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థపై వచ్చిన బ్యాంకు మోసం, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

రూ.40 వేల కోట్ల రణ ఎగవేత కేసు

రిలయన్స్ గ్రూప్ కంపెనీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్‌పై రూ.40 వేల కోట్ల రుణ ఎగవేత కేసు నమోదైంది. ఈ కేసులో అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. గత వారం ఆమెను విచారణకు హాజరుకావాల్సిందిగా కోరగా.. ఆమె వెళ్లలేదు. దీంతో రెండోసారి సమన్లు జారీ చేశారు. న్యూయార్క్‌లో ఒక విలాసవంతమైన నివాసం కొనుగోలు కేసులో టీనా అంబానీకి సమన్లు ​​జారీ చేసినట్లు తెలుస్తోంది.

Follow Us