PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ సాయం అందించేందుకు సిద్దమవుతోంది. దీంతో దేశంలోని రైతులందరూ దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నగదు అందుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆన్లైన్లో సులభంగా కేవైసీ పూర్తి చేయవచ్చు. అదెలా అనేది చూద్దాం.

పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారీ శుభవార్త. కేంద్రం త్వరలోనే 23వ విడత నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేందుకు సిద్దమవుతోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, ఏపీ, తెలంగాణను తాకగా.. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దీంతో త్వరలో తొలకరి పలకరించనుంది. రాష్ట్రంలో ఇక నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రైతులకు ఉపయోపడేలా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎప్పుడు పడతాయనే దానిపై ఒక క్లారిటీ కూడా వచ్చింది.
జులైలోనే అకౌంట్లోకి డబ్బులు
జులైలో కేంద్రం పీఎం కిసాన్ నగదును పంపిణీ చేయనుంది. ప్రధాని మోదీ నేరుగా వీటిని లబ్దిదారుల ఖాతాల్లోకి రిలీజ్ చేయనున్నారు. రుతుపవనాలకు ముందుగానే వీటిని రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనుల్లో వేగం పుంజుకునే అవకాశం ఉండటంతో త్వరగా విదుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిని పురస్కరించుకుని రైతులు త్వరగా నగదు విడుదల చేయాలని చూస్తోంది. ఇప్పటివరకు 22 విడతల సొమ్ము అందించగా.. వచ్చే నెలలో 23వ విడత సొమ్ము పంపిణీ చేయనుంది. ఈ విడత కింద రూ.2 వేలను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేయనుంది.
ఈ పని చేయకపోతే డబ్బులు కట్
అయితే త్వరలోనే జమ చేయనున్న రూ.2 వేలు మీ అకౌంట్లో పడాలంటే కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. తప్పనిసరిగా లబ్దిదారులు కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ తీసుకెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి వాటిని అందిస్తే సరిపోతుంది. మీ ఆధార్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది. ఇక పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయవచ్చు. వచ్చే నెలలో కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయనున్న క్రమంలో తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిచిపోయే అవకాశముంది. ఇక కొత్తగా ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు దరఖాస్తులను కేంద్రం ఆహ్వానిస్తోంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
