PPF vs SSY: ‘సమృద్ధి’గా సంతోషం.. మీ బంగారు తల్లి ఉజ్వల భవితకు ఇదే బెస్ట్ పథకం..
సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం తీసుకొచ్చినది. పదేళ్ల లోపు ఉన్న ఆడ పిల్లలు ఎవరైనా దీనిని ప్రారంభించవచ్చు. అదే విధంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ఎవరైనా, ఏ పని చేసే వారైనా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే పదేళ్ల వయసున్న ఆడ పిల్లల పేరుతో కూడా దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు.
పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతుంటారు. వారికి ఏ లోటు లేకుండా చూసుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంటారు. అందుకే ప్రభుత్వాలు కూడా వారి కష్టానికి అధిక ప్రయోజనాలను అందించేలా పలు పథకాలను తీసుకొస్తుంటాయి. వాటిల్లో పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంలో వచ్చే రాబడి పిల్లల చదువులకు, వారి పెళ్లిళ్లకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆడబిడ్డల తల్లిదండ్రులు ఈ పథకాలపై కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు ప్రధాన పథకాల గురించి ఈ రోజు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. అవేంటంటే సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్). ఈ రెండు పథకాలు దీర్ఘకాలంలో అధిక రాబడినిస్తాయి.
ఎవరు అర్హులంటే..
సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం తీసుకొచ్చినది. పదేళ్ల లోపు ఉన్న ఆడ పిల్లలు ఎవరైనా దీనిని ప్రారంభించవచ్చు. ఆ బిడ్డకు 21 ఏళ్లు నిండిన తర్వాత దాని నుంచి నగదు తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. అదే విధంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ఎవరైనా, ఏ పని చేసే వారైనా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే పదేళ్ల వయసున్న ఆడ పిల్లల పేరుతో కూడా దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు.
లాకిన్ పీరియడ్ ఇలా..
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఆడబిడ్డ పుట్టిన రోజు నుంచి ఆ బిడ్డ పదేళ్ల వయసుకు వచ్చే వరకూ ఎప్పుడైనా పెట్టుబడి పెట్టొచ్చు. దీనిలో పెట్టుబడి దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఆ బిడ్డకు 21 ఏళ్లు నిండే వరకూ మెచ్యూరిటీ రాదు. అయితే ఆ పిల్ల 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేయాలనుకుంటే ముందుగానే క్లోజ్ చేసుకొనే అవకాశం కల్పిస్తారు. అదే సమయంలో పీపీఎఫ్ 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరో ఐదేళ్లు మెచ్యూరిటీ సమయాన్ని పెంచుకునే వీలుంటుంది.
ఎంత పెట్టుబడి పెట్టాలి..
సుకన్య సమృద్ధి యోజనాలో ఒక ఏడాది కాలానికి కనీసం రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకూ ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పీపీఎఫ్ లో అయితే కనీసం రూ. 500 నుంచి రూ. 1.5 లక్షల వరకూ ఒక ఏడాదికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు ఖాతాలు పోస్ట్ ఆఫీసులతో పాటు బ్యాంకుల్లోనూ ప్రారంభించవచ్చు.
వడ్డీ ఎంత వస్తుందంటే..
సుకన్య సమృద్ధి యోజనాలో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం 8శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ వడ్డీ క్వార్టర్ ఒకసారి జమ చేస్తారు. అదే సమయంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 7.1 శాతం వడ్డీ అందిస్తారు.
ఏది బెస్ట్..
ఆడ బిడ్డల భవితకు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. దీనిలో వడ్డీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా అధిక రాబడి వస్తుంది. అలాగే పిల్ల 18 ఏళ్లు నిండి తర్వాత పాక్షిక నగదు ఉపసంహరణలకు అనుమతి ఇస్తుంది. పీపీఎఫ్ లో కూడా ఏడేళ్ల తర్వాత పాక్షిక ఉపంసహరణలకు అవకాశం దొరకుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..