Indian Railways: రైల్వే టికెట్ బుకింగ్ రూల్స్లో భారీ మార్పులు.. బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ.. ఆన్లైన్లో బుక్ చేయాలంటే..?
రైల్వేశాఖ ఆన్లైన్ టికెట్ల బుకింగ్ రూల్స్ను కఠినతరం చేసింది. ఆన్లైన్ టికెట్ల బుకింగ్స్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ వెరిఫికేషన్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇక నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది.

మెరుగైన ప్రయాణం కోసం రైళ్లల్లో ఎక్కువమంది జర్నీ చేస్తూ ఉంటారు. రైలు ప్రయాణాన్ని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ఇక జనరల్ క్లాస్ కంటే టికెట్ ముందుగానే బుక్ చేసుకుని ప్రయాణం చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. రైళ్లల్లో ప్రయాణించాలంటే వారం రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. లేకపోతే ముందు రోజు తత్కాల్ కోటా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టికెట్ల బుకింగ్లో అక్రమాలు జరుగుతున్నట్లు గమనించిన రైల్వేశాఖ.. రూల్స్ను మరింత కఠినతరం చేసింది. సామాన్యులకు రైళ్లల్లో సీట్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రూల్స్లో భారీ మార్పులు చేసింది. అందులో భాగంగా టికెట్ల బుకింగ్కు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. అంటే మీరు ఏదైనా రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిచేస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. మోసాన్ని తగ్గించడం, న్యాయమైన టికెట్ పంపిణీని నిర్ధారించడం లక్ష్యంగా రైల్వేశాఖ ఈ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఆన్లైన్లో ఏదైనా రైలుకు టికెట్లు రిలీజ్ చేసినప్పుడు మొదటి రోజు ఆధార్ ధృవీకరణ చేసిన వినియోగదారులు మాత్రమే బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే టికెట్లు కన్పార్మ్ అవుతాయి. అది చేయనివారికి టికెట్లు బుక్ అవ్వవు. మోసపూరిత బుకింగ్లకు ఈ విధానం వల్ల అడ్డుకట్టపడటంతో పాటు సరైన వ్యక్తి టికెట్లు బుక్ చేసుకున్నట్లు నిర్ధారణ అవుతుంది. తత్కాల్, అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్కు ఆధార్ ఐడెంటికేషన్ అనేది తప్పనిసరి చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
తొలి రోజున వీరికి మాత్రమే అవకాశం
ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్కు సంబంధించి ఆధార్ ధృవీకరణ పూర్తి చేసినవారికి మాత్రమే టికెట్లు రిలీజ్ చేసిన మొదటి రోజు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతావారు తర్వాతి రోజు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలుగుతారని ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఇక తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ అనేది తప్పనిసరి. తత్కాల్ టికెట్లలో జరుగుతున్న దుర్వినియోగం, నకిలీ అకౌంట్లను నియంత్రించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ రూల్స్లో జరిగిన ఈ మార్పుల వల్ల సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి అధిక సీట్లు లభిస్తున్నాయని రైల్వేశాఖ తెలిపింది. నకిలీ అకౌంట్లను ఎప్పటికప్పుడు గుర్తించి బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది.
