GST Fraud: ఒకే గదిలో 550 డమ్మీ కంపెనీలు.. కోట్లలో మోసం.. ఐపీఎస్ అధికారి పేరు కూడా వాడేసిన ముఠా..

GST Fraud: గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక గది నుంచి దాదాపు 550 డమ్మీ కంపెనీలు నడుపుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

GST Fraud: ఒకే గదిలో 550 డమ్మీ కంపెనీలు.. కోట్లలో మోసం.. ఐపీఎస్ అధికారి పేరు కూడా వాడేసిన ముఠా..
Follow us

|

Updated on: Jun 01, 2022 | 1:51 PM

GST Fraud: గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక గది నుంచి దాదాపు 550 డమ్మీ కంపెనీలు నడుపుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మోసపూరిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కోసం కోట్ల రూపాయల వస్తు సేవల పన్ను (GST) నడుపుతున్న ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ కమిషనరేట్, ఇండోర్, మధ్యప్రదేశ్ పోలీసుల సైబర్ స్క్వాడ్ సహాయంతో మే 25న సూరత్ నుంచి ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. దాదాపు 550 డమ్మీ కంపెనీల పేరుతో ఈ ముఠా చేసిన మొత్తం రూ.800 కోట్ల వ్యాపారంపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కేవలం కాగితాలపైనే చూపిన ఈ వ్యాపారం ద్వారా రూ.100 కోట్లకు పైగా జీఎస్టీని ఇన్పూట్ క్రెడిట్ మోసపూరితంగా ‘కమీషన్’ తీసుకుని ఇతర కంపెనీలకు విక్రయించినట్లు తేలింది. ఐపీఎస్‌ అధికారుల నుంచి రోజువారీ కూలీ పేరుతో అనేక మంది పేర్లపై ఈ డమ్మీ కంపెనీలను ముఠా నడుపుతోంది. డమ్మీ కంపెనీలను జీఎస్టీ విధానంలో నమోదు చేసేందుకు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజల గుర్తింపు పత్రాలను మరో ముఠా ద్వారా అక్రమంగా సేకరించినట్లు అధికారులు గుర్తించారు.

రోజువారీ కూలీ చేసుకునే పేద కార్మికుల నుంచి మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి వరకు.. అనేక మంది పేర్లు, చిరునామాలకు సంబంధించిన పత్రాలను చట్టవిరుద్ధంగా ఈ ముఠా ఉపయోగించింది. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా కోట్లాది రూపాయల మేర మోసపూరిత వ్యాపారం జరుగుతోందన్న విషయం కూడా వీరికి తెలియక పోవటం గమనార్హం. ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద కూడా డమ్మీ కంపెనీ ఉన్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. ముఠా వద్ద నుంచి పెద్ద సంఖ్యలో కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, సీల్స్, లెటర్ ప్యాడ్‌లు, డమ్మీ కంపెనీల వివరాలతో సహా స్వాధీనం చేసుకున్నట్లు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంపై వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సమగ్ర విచారణ జరుగుతుండగా.. చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ముఠా అక్రమాలపై పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నందున మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.