రఘురామకు వైసీపీ షాక్… లాస్ట్ మినిట్లో పంచ్
సొంత పార్టీ ఎంపీకి షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్కు...
సొంత పార్టీ ఎంపీకి షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్కు ముందుగా ఆహ్వానించిన పార్టీ పెద్దలు.. ఆ తర్వాత నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును దూరం పెట్టారు. పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని, లేవనెత్తిన అంశాలను వివరించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవలసిందిగా ముందుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఏపీ భవన్ అధికారులు సమాచారం అందించారు. అయితే ఆ తర్వాత కాసేపటికి పరిణామాలు వేగంగా మారిపోయాయి. కొద్దిసేపటి తర్వాత రఘురామకృష్ణం రాజుకు ఫోన్ చేసిన ఏపీ భవన్ అధికారులు.. వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావద్దని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. ముందుగా వచ్చిన ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న రఘురామకృష్ణంరాజు.. ఏపీ భవన్ అధికారులు వీడియో కాన్ఫరెన్సుకు రావద్దంటూ సమాచారం అందించడంతో షాక్కు గురైనట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా పార్టీ అభిప్రాయాలతో, విధానాలతో విభేదిస్తూ వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంటికింద రాయిలా మారిన విషయం తెలిసిందే. బీజేపీ అధినాయకత్వంతో సన్నిహితంగా మెలుగుతున్న రఘురామ కృష్ణంరాజు.. పార్టీ అభిప్రాయాలను విధానాలతోనే విభేదిస్తూ వస్తున్నారు. అయితే పార్టీ నాయకులను విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజు.. అధినేత జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఇంతవరకు ఏమీ అనలేదు. ఈ నేపథ్యంలో పార్టీ లైన్లోనే తాను ఉన్నానని తన సన్నిహితుల వద్ద రఘురామకృష్ణంరాజు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే సోమవారం ఉదయం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న వద్దంటూ పార్టీ అధినాయకత్వం సంకేతాలు పంపడంతో రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఏమిటి అన్న చర్చ మరోసారి మొదలైంది.