Plasma Therapy: ఇక ప్లాస్మా థెరపీకి గుడ్‌బై… ప్రభుత్వ నిర్ణయం వెనుక కారణాలివేనా?

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది. కరోనా రోగులకు ఇక నుంచి ప్లాస్మా థెరపీ పద్దతిలో చికిత్స ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

Plasma Therapy: ఇక ప్లాస్మా థెరపీకి గుడ్‌బై... ప్రభుత్వ నిర్ణయం వెనుక కారణాలివేనా?
Plasma Therapy
Follow us

|

Updated on: May 18, 2021 | 6:44 PM

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది. కరోనా రోగులకు ఇక నుంచి ప్లాస్మా థెరపీ పద్దతిలో చికిత్స ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిమ్స్, ఐసీఎమ్‌ఆర్‌, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. ప్లాస్మా థెరపీకి గుడ్‌బై చెబుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటానికి కారణాలు ఏంటో ఓ సారి చూద్దాం.

ప్లాస్మా థెరపీ అంటే…? గత ఏడాది కరోనా వేళ ఎక్కువగా వినిపించిన పేరు ప్లాస్మా థెరపీ. కరోనాను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి పరిస్థితి సీరియస్‌గా ఉన్న బాధితులకు ఎక్కించేవారు. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే (వారి రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు) దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉండే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే భావించారు. లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు. కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేయాలని, కరోనాతో పోరాడుతున్న వారి ప్రాణాలు నిలపాలని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పిలుపునివ్వడం తెలిసిందే. అయితే కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కోవిడ్‌ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Plasma Therapy

Plasma Therapy

కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారుకు నిపుణుల లేఖ… ప్లాస్మా థెరపీతో ఉపయోగమే లేదని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. పైగా దీంతో వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకురావచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేయడానికి కాన్వలసెంట్‌ ప్లాస్మాను ఎలాంటి హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా ఉపయోగిస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయ్‌ రాఘవన్‌కు పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు ఓ లేఖ కూడా రాశారు. దీనిపై సంతకం చేసినవారిలో ప్రముఖ టీకా నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌, శస్త్రచికిత్స నిపుణులు పరమేశ్‌ సి.ఎస్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులున్నారు. రోగనిరోధక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి ప్లాస్మాను ఇచ్చినప్పుడు.. యాంటీబాడీలకు పెద్దగా లొంగని కొత్త కరోనా వైరస్‌ రకాలు పుట్టుకురావొచ్చని ప్రాథమిక పరిశోధన ఫలితాలు చెబుతున్నట్లు నిపుణులు తమ లేఖలో వివరించారు.

ఈ చికిత్స విధానంపై “ఐసీఎంఆర్‌-ప్లాసిడ్‌” పేరుతో సర్వే ప్లాస్మా థెరపీపై దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రపంచంలోనే తొలిసారిగా ‘ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్‌’ను నిర్వహించినట్లు నిపుణులు తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు ఉద్ధృతం కాకుండా ఈ చికిత్స నిలువరించలేదని, మరణాల రేటునూ తగ్గించలేదని వెల్లడైనట్లు చెప్పారు. వెంటిలేటర్‌పై లేని కొవిడ్‌ బాధితులకూ దీనివల్ల పెద్ద ఉపయోగం లేదన్నారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికాలు కూడా ప్లాస్మా చికిత్స చేయవద్దని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

లాన్సెట్‌ తాజా అధ్యయనంలో కూడా… ప్లాస్మా థెరపీ వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన దాఖలాలు లేవని యూకే మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తాజా అధ్యయనంలో తేల్చింది. బ్రిటన్‌లో గతేడాది మే 28 నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 11,558 మంది రోగులను 2 కేటగిరీలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. ప్లాస్మా థెరపీ తీసుకున్న 5,795 మందిలో 1,399 (24 శాతం) మంది మరణించగా..ఇతర సాధారణ చికిత్స తీసుకున్న 5,763 మందిలో 1,408 (24 శాతం) మంది మరణించినట్టు గుర్తించారు.

అర్జెంటీనాకు చెందిన ప్లాస్మాఆర్‌ ట్రయిల్స్‌ కూడా ప్లాస్మా థెరపీతో రోగులకు పెద్దగా లాభమేమీ లేదని తేల్చింది. మెడికల్‌ వెంటిలేషన్‌ అవసరం విషయంలో కూడా ప్లాస్మా, సాధారణ చికిత్సల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని తేలింది.

ఇవి కూడా చదవండి…దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా యజ్ఞం.. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన వ్యాక్సినేషన్.. ఇప్పటివరకు ఎంతమందికి అందిందంటే!

ఇంటి చికిత్స పొందినోళ్ళే బెటర్.. ఆసుపత్రికెళ్ళొచ్చినోళ్ళపైనే సెకెండ్ వేవ్ ప్రభావం అధికం