ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధులు తగ్గుతాయా? వైరల్ వార్తలపై డాక్టర్లు చెప్పే విషయాలు తెలిస్తే షాకవుతారు.
మన శరీరంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వడపోత ప్రక్రియకు నీరు అవసరమే. అందుకే ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు మరింత శుభ్రపడతాయని సామాన్యులు భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నీరు కిడ్నీల పనితీరుకు మద్దతు ఇస్తుందే తప్ప, ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీలను పునరుద్ధరించలేదు.

ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లు తాగడం ఎంతో అవసరమని మనందరికీ తెలుసు. చర్మ సౌందర్యం నుంచి జీర్ణక్రియ మెరుగుపడటం వరకు నీరు చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధులను తొలగించవచ్చని, పాడైన కిడ్నీలను కూడా బాగు చేసుకోవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ, ఈ నమ్మకంలో ఎంతవరకు నిజం ఉంది?
నీరు పరిష్కారం కాదు
నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలను నివారించవచ్చు. కానీ కిడ్నీ వ్యాధిని రివర్స్ చేయలేము.”కిడ్నీ సమస్యలు సాధారణంగా మధుమేహం, అధిక రక్తపోటు (BP), ఇన్ఫెక్షన్లు లేదా జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. ఒకసారి కిడ్నీలోని ఫిల్టర్లు దెబ్బతిన్న తర్వాత, ఎంత నీరు తాగినా అవి మళ్ళీ పాత స్థితికి రావు. వీటికి సరైన మందులు, జీవనశైలి మార్పులు మాత్రమే అవసరం.
అతిగా నీళ్లు తాగితే అనర్థమేనా?
నిజానికి, కిడ్నీ సమస్యలు ఉన్నవారు పరిమితికి మించి నీరు తాగడం వల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చు. సైట్కేర్ హాస్పిటల్స్ నిపుణులు డాక్టర్ కృతిక మోహన్ చెబుతున్న దాని ప్రకారం.. అడ్వాన్స్డ్ కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో వ్యర్థాలను పంపే సామర్థ్యం తగ్గిపోతుంది. అటువంటి వారు ఎక్కువ నీరు తాగితే శరీరంలో వాపులు రావడం, రక్తపోటు పెరగడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
ఆరోగ్యంగా ఉన్న పెద్దలు రోజుకు 2 నుండి 3 లీటర్ల ద్రవ పదార్థాలు (ఆహారం, పానీయాల రూపంలో కలిపి) తీసుకోవచ్చు. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం తమ శరీర స్థితిని బట్టి వైద్యుల సలహా మేరకు మాత్రమే నీరు తాగాలి. సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి గుడ్డిగా 4 లీటర్లు తాగేయడం ప్రమాదకరం. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం నీటిపైనే ఆధారపడటం సరికాదు. రక్తపోటు, షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవడం మరియు క్రమం తప్పకుండా కిడ్నీ స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం. నీరు తాగడంలో సమతుల్యత పాటించడమే అసలైన సూత్రం!
