అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ కింద ఏడాదికి రూ.24 వేలు, పసుపు కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ.20 వేలు, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నామని, ఈ మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్కు దిశా నిర్దేశం చేశారు. జాతీయ పార్టీల నేతలతో చర్చలు సఫలం అయ్యాయని, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనుకోవడం చారిత్రక నిర్ణయమని అన్నారు. రైతు సాయానికి కేంద్రం ఎన్నో షరతులు విధించిందని, మనం దానికంటే మెరుగ్గా …కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నో కష్టాల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు జరిగింది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అన్నారు.
ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చీరాలలో పార్టీ బలంగా ఉందని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు అని ఆమంచి పార్టీ వీడడంపై వ్యాఖ్యానించారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్నది కార్యకర్తలేనని పేర్కొన్నారు. . అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే మిన్న అని వ్యాఖ్యానించారు. తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణమని సిఎం వాపోయారు.