AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగులకు అనుమతించండి.. మంత్రికి విఙ్ఞప్తి

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేకమంది ఇళ్ళలోనే ఉంటున్నారని, వారికి ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకుగాను టీవీ ప్రోగ్రాములు, సీరియళ్ళ షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని పలు చానళ్ళ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

షూటింగులకు అనుమతించండి.. మంత్రికి విఙ్ఞప్తి
Rajesh Sharma
|

Updated on: May 02, 2020 | 6:13 PM

Share

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేకమంది ఇళ్ళలోనే ఉంటున్నారని, వారికి ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకుగాను టీవీ ప్రోగ్రాములు, సీరియళ్ళ షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని పలు చానళ్ళ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మాసాబ్ ట్యాంక్‌లోని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు ఎంటర్‌టైన్మెంట్ టీవీ ఛానళ్ళ ప్రొగ్రామింగ్ హెడ్స్ కలిశారు. వారిలో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే.సుబ్రహ్మణ్యం, తెలుగు టీవీ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ తదితరులున్నారు.

ఇంటి పట్టునే వుంటున్న ప్రజలకు టీవీ ఒక్కటే వినోద సాధనమని, టీవీ ప్రోగ్రాములు, సీరియళ్ళ షూటింగులు గత 45 రోజులుగా నిలిచిపోవడంతో పాత ప్రోగ్రాములనే రిపీట్ చేయాల్సి వస్తుందని వారు మంత్రికి వివరించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని వారు అందజేశారు. టివి ప్రోగ్రాముల షూటింగ్‌లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు.

కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారని, వారికి ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు షూటింగ్‌లను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని వారు కోరారు. స్పందించిన మంత్రి ఈ నెల 5 వ తేదీన ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.