AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు క్వాడ్ వ్యుహం.. తొలిసారిగా భేటీ అవుతున్న చతుర్భుజ భద్రతా కూటమి

చతుర్భుజ భద్రతా కూటమిలో (క్వాడ్‌) భాగస్వామ్య పక్షాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు శుక్రవారం తొలిసారిగా సమావేశం కానున్నారు.

చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు క్వాడ్ వ్యుహం.. తొలిసారిగా భేటీ అవుతున్న చతుర్భుజ భద్రతా కూటమి
Balaraju Goud
|

Updated on: Mar 11, 2021 | 10:55 AM

Share

QUAD summit 2021 : చతుర్భుజ భద్రతా కూటమిలో (క్వాడ్‌) భాగస్వామ్య పక్షాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు శుక్రవారం తొలిసారిగా సమావేశం కానున్నారు. మార్చి 12న జరిగే ఆన్‌లైన్‌ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్, జపాన్‌ ప్రధాని యోషిహిడో సుగాలు పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ తొలిసారిగా ప్రధాని మోదీతో ఈ సదస్సులో ముఖాముఖి కానున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వర్తమాన అంశాలపై చర్చించనున్నారు.

పోఖ్రాన్‌ అణుపరీక్షల అనంతరం భారత్‌పై అసంబద్ధ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో అగ్రదేశాలన్నింటితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టింది అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పాయి ప్రభుత్వం. ఒకరికి చేరువ అవుతున్నామంటే అర్థం మరో దేశానికి దూరం జరుగుతున్నట్లు కాదన్న వాజ్‌పేయి వ్యాఖ్యలో అలీనోద్యమ భావన ధ్వనించింది. రెండు దశాబ్దాల్లోనే భౌగోళిక రాజకీయ వాతావరణం గణనీయంగా మారిపోయింది. 2004నాటి హిందూ మహా సముద్ర సునామీ బాధితుల్ని ఆదుకోవడానికి చేతులు కలిపి సఫలమైన దేశాల సహకారాన్ని వ్యవస్థీకృతం చేయాలన్న ఆలోచనతో ముందడుగు పడింది.

హిందూ, పసిఫిక్‌ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛా సౌభాగ్యాలే ‘విజన్‌’గా ఓ ‘బృందం’ ఏర్పడాలన్న అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఆకాంక్ష- 2006నాటి ఢిల్లీ, టోక్యోల సంయుక్త ప్రకటనలోనూ ప్రస్తావనకు నోచుకొంది. 2007నాటి ప్రాథమిక సంప్రదింపుల దశలోనే.. ఎందుకు, ఏమిటీ అంటూ డ్రాగన్ కంట్రీ ఆరాలు మొదలు పెట్టగానే, ఆ యత్నం కొడిగట్టిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అమెరికా, జపాన్‌, ఇండియా, ఆస్ట్రేలియాల చతుర్భుజ(క్వాడ్‌) భద్రతా చర్యల యంత్రాంగం రూపుదిద్దుకుంది. ఇటీవల కాలంలో నాలుగు దేశాల మలబార్‌ నౌకాదళ విన్యాసాలను సైతం విజయవంతంగా జరిగాయి.

ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా ఈ సదస్సులో వ్యూహ రచనకు నాలుగు దేశాలు సిద్ధమవుతున్నాయి. క్వాడ్‌ భాగస్వామ్య పక్షాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు శుక్రవారం తొలిసారిగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై యుద్ధం చేయడం, ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా మిలటరీ శక్తిని దుర్వినియోగంపై చర్చించడమే ఈ క్వాడ్‌ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ప్రపంచ దేశాలను కరోనా కుదిపేస్తున్న నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు ఆర్థిక ఒప్పందాలను ఈ సదస్సులో ప్రకటించే అవకాశం ఉందని అమెరికా వైట్‌ హౌస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అమెరికా ఔషధ సంస్థలైన నోవావాక్స్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన వ్యాక్సిన్‌ల తయారీ భారత్‌లో చేపట్టేలా ఈ సదస్సులో ఒప్పందం కుదిరే అవకాశాలైతే కనిపిస్తు న్నాయి. వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చునని, భారత్‌లో టీకా డోసుల తయారీని పెంచి ఆగ్నేయాసియా దేశాలకు పంపిణీ చేయాలని క్వాడ్‌ దేశాలు యోచిస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌–19 సంక్షోభంతో పాటుగా ఆర్థిక సహకారం, వాతావరణం మార్పులు వంటి అంతర్జాతీయ సమస్యలపై ఈ సదస్సులో లోతుగా చర్చించను న్నట్టుగా వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకి చెప్పారు. 2004లో సునామీ ముంచెత్తిన తర్వాత క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. అప్పట్నుంచి విదేశాంగ ప్రతినిధులే సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆ కూటమి ఏర్పాటైన ఇన్నేళ్లకి తొలిసారిగా దేశాధినేతలు సమావేశం కానున్నారు.

ఇదిలావుంటే, దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్‌ దేశం పట్టు బిగిస్తూ ఉండడంతో క్వాడ్‌ సదస్సు ద్వారా ఆ దేశానికి గట్టి హెచ్చరికలు చేయాలనే ఉద్దేశంలో బైడెన్‌ ఉన్నారు. ఈ సమా వేశం ద్వారా ప్రాంతీయంగా శాంతి స్థాపన జరగా లని కోరుకుంటున్నట్టుగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు.

Follow Us