AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: బొత్స అడ్డాలో హవా ఎవరెవది..? ఆయన కంచుకోట పదిలమేనా?

ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అందరి చూపు ఆ జిల్లా పైనే ఉంది. వైసిపి కంచుకోట బొత్స ఇలాకాలో పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ శాతం ఎలా ఉంది? జరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్, ఎవరి మైనస్.. బొత్స లీడర్ షిప్ లో మరోసారి జిల్లాలో వైసిపి తన జెండా ఎగురవేస్తుందా? మరోసారి బొత్స తన ముద్ర వేసుకోనున్నారా?

Vizianagaram: బొత్స అడ్డాలో హవా ఎవరెవది..? ఆయన కంచుకోట పదిలమేనా?
Botsa Satyanarayana
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: May 18, 2024 | 9:39 PM

Share

బొత్స లీడర్ షిప్‌లో విజయనగరం జిల్లా వైసీపీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది స్థానాలు వైసిపి కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. మంత్రి బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను.. పదునైన వ్యూహాలతో రాజకీయాలు నెరిపి జిల్లాను వైసిపికి పెట్టని కోటగా మార్చారు. ఓ వైపు బొత్స లీడర్ షిప్ బలంగా ఉండటంతో పాటు మరోవైపు టిడిపికి జిల్లాలో ఉన్న నాయకత్వ లోపం వైసిపికి మరో ప్లస్ పాయింట్‌గా మారింది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను అంతా తానై సింగల్ హ్యాండ్‌గా నడిపించిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు అనారోగ్య కారణాలతో అంత యాక్టివ్‌గా లేకపోవడం టీడీపీకి పెద్ద కష్టంగా మారింది. జిల్లా టిడిపిలో ఉన్న వర్గపోరు ఆ పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితుల్లోనే ప్రస్తుత ఎన్నికలను టిడిపి అధిష్టానం కూడా సవాలుగా తీసుకొని ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చీపురుపల్లి, గజపతినగరం, పార్వతీపురంలో అభ్యర్ధులను మార్చింది. అంతేకాకుండా పోల్ మేనేజ్మెంట్‌ను ప్రధానంగా నమ్ముకుంది. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించింది టీడీపీ.

ఇలా ఇరు పార్టీలు ఓటర్లను పోలింగ్ బూతుల వద్దకు చేర్చి పోలింగ్ శాతాన్ని పెంచగలిగారు. అలా 2019 కన్నా ప్రస్తుతం జరిగిన 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. 2019లో 80.67 శాతం పోలింగ్ శాతం నమోదవ్వగా ప్రస్తుతం 81.33 శాతం పోలైంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం అంతంత మాత్రంగానే పెరిగింది. దీంతో ఇరు పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమకే విజయావకాశాలు ఉన్నాయని కార్యకర్తలకు చెప్పుకొస్తున్నారు. తొమ్మిది నియోజకవర్గాల్లో గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓట్లు పెరగడం, పోలింగ్ శాతం కూడా పెరగడం చూసి కొందరు అభ్యర్థుల్లో ఆందోళన, మరికొందరు అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. దీంతో పోలింగ్ స్టేషన్ల వారీగా లెక్కల్లో పడ్డారు అభ్యర్థులు. నిన్నటి మొన్నటి వరకు ఎన్నికలు ఎలా జరుగుతాయో అన్న ఆందోళన ఉంటే, ఇప్పుడు ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం పెరిగిన పోల్ శాతం కొందరు అధికార పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తుంటే, మరికొందరు ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. అయితే వారి ఆందోళనను ఏ మాత్రం బయటకు తెలియకుండా ఎవరికి వారే తామే గెలుస్తున్నమని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. అయితే మంత్రి బొత్స, జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను మాత్రం మరోసారి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, పెరిగిన ఓట్ల శాతం తమకు అనుకూలంగా మారిందని చెప్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన సరళి తమకు అనుకూలమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎవరు ఎలా ధీమా వ్యక్తం చేసిన గెలిచేదెవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…