AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మూడు రోజులపాటు కుండపోత.. ఈ జిల్లాల్లో ఉన్న వాళ్లకు హై అలర్ట్‌…. పిడుగులు పడే ఛాన్స్‌ ఎక్కువ..

ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

మరో మూడు రోజులపాటు కుండపోత.. ఈ జిల్లాల్లో ఉన్న వాళ్లకు హై అలర్ట్‌.... పిడుగులు పడే ఛాన్స్‌ ఎక్కువ..
Rain Alert
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2023 | 8:44 PM

Share

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలు మరో మూడు రోజులుపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. . రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ ఒడిశా వరకు ఉంది. బంగ్లాదేశ్‌కు ఆనుకొని ఏర్పడిన మరో ద్రోణి కూడా బలహీన పడింది. ఐఎండి అంచనాల ప్రకారం తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది. కృష్ణా, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, నెల్లూరు.. ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన కురుస్తోంది.

ద్రోణి ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

ఎల్లుండి కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ