వీదికో వెరైటీ గణేష్.. ఆ నగరంలో భక్తులను ఆకట్టుకుంటున్న రంగురంగుల వినాయకులు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగుతున్నాయి. వీధివీధినా కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈసారి ఇక్కడి మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు, భారీ సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సరికొత్త ఆలోచనలు, వినూత్న అలంకరణలతో యువకులు నెలల తరబడి శ్రమించి తీర్చిదిద్దిన రూపాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

కర్నూలు జిల్లాలో ఈసారి సరికొత్త ఆలోచనలు, వినూత్న అలంకరణలతో వినాయక మండపాలు దర్శనమిస్తున్నాయి. ఈ సారి కొత్తగా నగరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గురివింద గింజలతో స్థానిక యువకులు గణనాథుడిని ఏర్పాటు చేశారు. సుమారు ఇరవై రోజుల పాటు శ్రమించి ఈ వినూత్న గణపతిని రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే సినీ నటుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని తలపించేలా శ్రీ లక్ష్మి జమ్ములమ్మ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్ వేశారు. శబరిమలలో మహిళల ప్రవేశానికి ఉన్న పరిమితుల దృష్ట్యా, ఇక్కడే భక్తులు అయ్యప్ప సన్నిధానాన్ని దర్శించుకునేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
పంచలోహ గణేషుడు
ఇక కోర్టు రోడ్డులోని ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రూ. 70 వేల విలువైన పంచలోహ బిళ్ళలు, సుమారు కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలతో గణనాథుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండపంలో భారీగా బంగారం ఉండటంతో భద్రత కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
శంఖాలు, చిప్పలతో మత్స్యావతార గణపతి
ఇక మరో కాలనీలో చీరాల, బాపట్ల వంటి సముద్ర తీర ప్రాంతాల నుంచి సేకరించిన శంఖాలు, చిప్పలు, గౌమేధికాలతో శ్రీ మత్స్యావతార రూపంలో వినాయక విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దీని తయారీకి రెండు నెలల సమయం పట్టినట్టు నిర్వాహకులు తెలిపాఉ. ఈ మట్టి గణపతి కోసం తుంగభద్ర నది సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మంత్రాలయం, గురుజాల పరిసరాల నుంచి పవిత్ర మట్టిని సేకరించి ఉపయోగించనట్టు తెలిపారు.
మొత్తంగా ఈసారి భక్తి, కళ, సృజనాత్మకత కలగలిసిన ఎమ్మిగనూరు గణనాథుల మండపాలు ప్రస్తుతం భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
