AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union budget 2021:ఆశగా ఎదురు చూసినా ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపు అంతంత మాత్రమే.. అసలు రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులేంటీ..?

రాష్ట్ర విభజనతో కనీస వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక.. ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌పై మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచింది.

Union budget 2021:ఆశగా ఎదురు చూసినా ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపు అంతంత మాత్రమే.. అసలు రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులేంటీ..?
Balaraju Goud
|

Updated on: Feb 02, 2021 | 4:25 PM

Share

Union budget 2021 AP allocations : బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర విభజన సమస్యలను సైతం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. రైల్వే జోన్‌ మాటే ఎత్తలేదు.ఇప్పటికే అన్ని వనరులూ ఉండి ఆర్థిక పరిపుష్టి కలిగిన కేరళ, కర్ణాటక, మహారాష్ట్రవంటి రాష్ట్రాలపై కేంద్రం అపార ప్రేమను చూపింది. రాష్ట్ర విభజనతో కనీస వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక.. ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచింది.

కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్ర వాసులకు మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన మొత్తం బడ్జెట్‌ ప్రసంగంలో.. ఏపీలో మూడు ప్రాంతాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌, ఖరగ్‌పూర్‌-విజయవాడ, ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా రైల్వే కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. జాతీయ రహదారి ప్రాజెక్టుల వల్ల ప్రత్యేకంగా ఏపీకి ఒరిగేదేమీ లేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

రైల్వే రవాణా కారిడార్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కావడం, తీరం వెంట కొత్త ఓడరేవులు అభివృద్ధి చెందనుండటం, విజయవాడ జంక్షన్‌ మధ్యలో ఉండటంతో ఉత్తర, దక్షిణ భారతాల అనుసంధానంలో భాగంగానే ఆ రైల్వే రవాణా కారిడార్లను కేంద్రం ప్రకటించింది. మన రాష్ట్రంలోని ఓడరేవులకు, సరకు రవాణాకు అవి కొంత ఆలంబనగా నిలిచే అవకాశం ఉంది.

విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి మంజూరుచేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురంలోని జేఎన్‌టీయూలో ఒక భవనంలో నడుస్తోంది. దానికి 2020-21 బడ్జెట్‌లో రూ.60.35 కోట్లు కేటాయించిన కేంద్రం.. సవరించిన అంచనాల్లో మాత్రం రూ.4.80 కోట్లే చూపించింది. ఈ బడ్జెట్‌లో మళ్లీ రూ.60.35 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన వర్సిటీలకు కలిపి 2020-21 బడ్జెట్‌లో రూ.53.80 కోట్లు కేటాయించిన కేంద్రం.. సవరించిన అంచనాల్లో దాన్ని రూ.4కోట్లకే పరిమితం చేసింది. ఈ బడ్జెట్‌లో మళ్లీ రూ.53.80 కోట్లు ప్రతిపాదించింది.

రైల్వేలకు సంబంధించి ఈస్ట్ కోస్ట్ కారిడార్‌లో భాగంగా ఖరగ్ పూర్ – విజయవాడ, ఈస్ట్ కోస్ట్ కారిడార్‌లో భాగంగా భూసావల్ – ఖరగ్ పూర్ – దంకుని వరకు, నార్త్ సౌత్ (నైరుతి) కారిడార్ లో భాగంగా ఇటార్సి – విజయవాడ మధ్య రైల్వే సరుకు రవాణాను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే, డిటెయిల్ ప్రాజెక్టును మొదటి దశలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా రాయపూర్ – విశాఖపట్నం మధ్య 464 కిలోమీటర్ల దూరం ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి నిధులు కేటాయించారు.

విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే రాష్ట్రంలో 100 కి.మీ ఉంటుంది. విశాఖ జిల్లాలోని సబ్బవరం వద్ద మొదలై విజయనగరం జిల్లా కొత్తవలస, విజయనగరం, సాలూరు సమీపం నుంచి ఒడిశా సరిహద్దుకు వెళ్తుంది. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మన రాష్ట్రంలో 95 కి.మీ. మేర ఉంటుంది. చిత్తూరు జిల్లా మీదుగా వెళ్తుంది. చిత్తూరు నుంచి చెన్నై సమీపంలోని తచ్చూరు వరకు 123 కి.మీ. మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ పనులు కూడా వచ్చే ఏడాది మొదలు కానున్నాయి. ఇది మన రాష్ట్ర పరిధిలో 83 కి.మీ ఉంటుంది. కేంద్ర ఉక్కు శాఖ తాజా బడ్జెట్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.595 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.1,385 కోట్లు కేటాయించిన ప్రభుత్వం సవరించిన అంచనాల నాటికి రూ.534 కోట్లకు తగ్గించింది. అంటే గత బడ్జెట్‌లోనే దాదాపు రూ.851 కోట్లు కోతపెట్టింది. ఈసారి బడ్జెట్‌ను కేవలం రూ.595 కోట్లకు పరిమితం చేసింది.

ఇంటర్నల్, ఎక్స్‌ట్రా బడ్జెటరీ రిసోర్సెస్‌ (ఐఈబీఆర్‌) కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులు సమకూర్చనున్నట్టు కేంద్రం తెలిపింది. సొసైటీ ఫర్‌ అప్లయిడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, రీసెర్చి (సమీర్‌) కేంద్రాలకు రూ.120 కోట్ల మేర నిధులు కేటాయించింది. విశాఖపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది.

అయితే ఏపీకి కేటాయించిన నిధులపై ఇవాళ రాజ్యసభలో ఆర్థిక మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి వరకు అందించిన నిధుల వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఫిబ్రవరి నాటికీ 2 కోట్ల 61 లక్షల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రూ.51.63 కోట్లు, పీఎం కిసాన్ 46,95,820 మంది లబ్దిదారులకు కేంద్రం నుంచి ప్రయోజనం అందుతుంది. ఇక, ఫిబ్రవరి నాటికీ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ద్వారా 60,13,565 మంది లబ్దిదారులకు వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు వారి ఖాతాల్లో ఈపీఎఫ్ ద్వారా రూ.116.51 కోట్లు జమ చేసినట్లు కేంద్ర వెల్లడించింది. అలాగే, ఎన్‌ఎస్ఏపీ ద్వారా 9,32,661 మంది లబ్దిదారులను ఆదుకోవడం జరిగిందని పేర్కొంది. జిల్లా మినరల్ ఫండ్ స్కీం ద్వారా రూ.131.48 కోట్లు కేటాయించిట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో అశించినంతగా కేటాయింపులు లేకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర విభజన సమస్యలకు తోడు కరోనా మహమ్మారి తీసిన దెబ్బకు ఏపీ రాష్ట్రం పూర్తి సంక్షోభంలో చిక్కుకుందని పెద్ద దిక్కులా ఆదుకోవల్సిన కేంద్రం చిన్న చూపు చూసిందని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు.

Follow Us