Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల విడుదల ఆరోజే.. బుక్ చేసుకోండిలా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా 24న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. గురువారం (నవంబర్24) దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా 24న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ అధికారిక వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు రోజులు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
కాగా టీటీడీలో పేరుకుపోయిన ఉపయోగించిన గోనె సంచులు , టిన్నులను డిసెంబరు 1, 2 తేదీల్లో టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో ఉన్న మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో ఈ వేలం జరుగనుందని, ఆసక్తి గలవారు రూ.590లు చెల్లించి టెండరు షెడ్యూల్ పొందవచ్చని సూచించారు. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం 70,163 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.22 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. అలాగే స్వామివారికి 31,489 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..