Andhra Pradesh: తిరుపతిలో రోడ్డుపై మహిళ ప్రసవం.. ఏపీ ప్రభుత్వ వివరణ ఏంటంటే..?
ఏపీలోని తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తంచేస్తున్నారు.
AP govt clarifies on Tirupati incident: ఏపీలోని తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ అసలు వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. తిరుపతిలో మహిళకు ప్రసవం ఘటనలో.. సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేసి.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంది. అదంతా అవాస్తవమంటూ వెల్లడించింది. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. కానీ, తిరుపతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమంటూ స్పష్టంచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన విషయాలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. సదరు మహిళ మానసిక సమస్యతో బాధపడుతుందని పేర్కొంది. ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తిరుపతిలో రోడ్డుపై వదిలేసి వెళ్లారని.. అంతేకాదు ఆమెకు గర్భం గురించి తెలియని పరిస్థితుల్లో ఉందని తెలిపింది. ఇప్పుడు మహిళ, ఆమెకు జన్మించిన పాప ఆరోగ్యంగా ఆస్పత్రిలో ఉన్నారని.. వారి సంరక్షణను ఎప్పటికప్పుడు చూసుకుంటున్నట్లు తెలిపింది. ఆస్పత్రి సిబ్బందిపై చేసిన ద్వేషపూరిత దుష్ప్రచారం బాధాకరమంటూ పేర్కొంది. ఇలాంటి విషయాల్లో అసలు నిజం తెలుసుకోవాలంటూ స్పష్టంచేసింది.
వీడియో చూడండి..
A malicious campaign was run by influential handles on social media regarding negligence by Tirupati Hospital as a woman was seen delivering a baby with the help of locals. The incident was unfortunate but the claims made regarding medical negligence in completely untrue. 1/2 pic.twitter.com/sq24eu0vYt
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 23, 2022
తిరుపతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో రోడ్డు గర్భిణీ ప్రసవించిందని.. సోషల్ మీడియాలో రెండురోజుల క్రితం వైరల్ అయింది. అయితే, ఆ మహిళ కొద్దిరోజులుగా అక్కడ రోడ్లపై సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆమెకు మతిస్థిమితం లేదని చెబుతున్నారు. అసలు ఆ మహిళ ఆస్పత్రికే రాలేదని.. సహాయకులు ఆమె వెంట లేరని.. ఆస్పత్రిలో చేర్చుకోలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది సైతం క్లారిటీ ఇచ్చారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో.. వైరల్ అవ్వడం, కీలక నాయకులు షేర్ చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, దీనిపై తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..