తిరుమల దర్శనం పేరుతో భారీ మోసం.. టీటీడీ ఉద్యోగినని చెప్పి రూ.51 వేల టోకరా!
Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి టికెట్లు, వసతి కల్పిస్తామని భక్తులను నమ్మించి రూ.51,800 మోసం చేసిన ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగినని చెప్పి భక్తులకు టోకరా వేసిన ముఠా బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. దర్శనం, సేవలు, వసతి కోసం కేవలం అధికారిక టీటీడీ మార్గాలనే ఉపయోగించాలని భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో బురిడీ కొట్టించిన మరో ముఠా బండారం తిరుమలలో బయట పడింది. టీటీడీ ఉద్యోగినంటూ బురిడీ కొట్టించిన కేటుగాడు. శ్రీవారి దర్శనంతో పాటు వసతి ఇప్పిస్తానని భక్తులను మోసం చేసినట్లు పోలీసులు తేల్చారు. టీటీడీలో మజ్దూర్గా పని చేస్తూ సస్పెండ్ అయిన శంకరయ్య, అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కోళ్ల ఫారంకు చెందిన వెంకటరమణ నాయక్ ఇద్దరూ ముఠాగా ఏర్పడి భక్తులను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన మల్లికార్జున రావు కుటుంబానికి శ్రీవాణి టికెట్లు, వసతి ఇప్పిస్తామంటూ మోసగించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యవహారాన్ని బయటపెట్టారు. గత కొంత కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. టిటిడి ఉద్యోగిగా చలామణి అవుతూ శంకరయ్య, వెంకటరమణ నాయక్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
శ్రీవాణి టికెట్లు, వసతి ఇప్పిస్తామంటూ మల్లికార్జున నుంచి రూ. 51,800 తీసుకొని మోసం చేసాడని తేల్చారు. భక్తులను నమ్మించి మోసాలకు పాడినట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుల నుంచి రూ. 11,800 నగదు, రెండు సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.42/2026, U/s 318(4) BNS r/w 3(5) BNS కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు.
విచారణలో నిందితులు శ్రీవారి దర్శనం, శ్రీవాణి టిక్కెట్లు, అర్చన సేవ, తోమాల సేవ, వసతి ఏర్పాటు చేస్తామని భక్తులను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. తిరుమల ముళ్ళగుంట కార్ పార్కింగ్ ప్రాంతంలో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 15 రోజుల జ్యూడిషయల్ రిమాండ్ విధించారు. గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడి 3 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు లు తేల్చారు.
తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం, వసతి, ప్రత్యేక సేవల పేరుతో చెప్పే వారి మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని, కేవలం TTD అధికారిక వెబ్సైట్ ద్వారానే టిక్కెట్లు, సేవలు పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్ధారించుకోకుండా ఎవ్వరికీ డబ్బులు వేసి మోసపోవద్దంటున్నారు. అమాయక భక్తులే లక్ష్యంగా మాయమాటలు చెప్పి దర్శనాలు, రూములు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడితే.. పోలీస్ శాఖ, టిటిడి విజిలెన్స్ తెలియజేయాలంటున్నారు. మోసాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని చెప్పే మోసగాళ్ల కదలికలపై పోలీస్, విజిలెన్స్ విభాగాల నిరంతర నిఘా కొనసాగుతోందని టిటిడి చీఫ్ విజిలెన్స్ అధికారి మురళీకృష్ణ హెచ్చరిస్తున్నారు. భక్తులు ఏదైనా సందేహం వచ్చినప్పుడు టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ 18004253333 ద్వారా గాని, పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112 ద్వారా గాని సంప్రదించి వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలని కోరుతున్నారు.
