ఆ ఊరి కోటకే కాదు గేటుకు ఒక చరిత్ర ఉంది.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
నూజివీడు ఈ పేరు వినగానే నోరూరించే రసాలు గుర్తొస్తాయి. నూజివీడు మామిడి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా నూజివీడు వీణలు సైతం ఎన్నో ప్రత్యేక గౌరవాలు దక్కించుకున్నాయి. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాలు మైసూర్లో జరిపినట్లుగా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే నూజివీడులో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఏలూరు మార్చి 18: నూజివీడు ఈ పేరు వినగానే నోరూరించే రసాలు గుర్తొస్తాయి. నూజివీడు మామిడి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా నూజివీడు వీణలు సైతం ఎన్నో ప్రత్యేక గౌరవాలు దక్కించుకున్నాయి. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాలు మైసూర్లో జరిపినట్లుగా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే నూజివీడులో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా నూజివీడు కోటకు సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ రాజవంశస్తులకు ఎంతో చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకులను ఎదిరించడంలో నూజివీడును పాలించిన సంస్థానాదిశులకు స్వాతంత్రోద్యమ సమయంలో ప్రత్యేక గౌరవం దక్కింది. నూజివీడు కోటను 12వ శతాబ్దంలో నిర్మించి, సంస్థానాన్ని 18 పరగణాలుగా విభజించి పాలన సాగించారు. 18 పరగణాలలో సుమారు 231 గ్రామాలు నూజివీడు సంస్థానంలో ఉండేవి. ఇప్పటికీ నూజివీడు కోటకు సంబంధించిన కట్టడాలు చెక్కుచెదరకుండా మనకు దర్శనం ఇస్తాయి.
అందులో ముఖ్యంగా కోటకు రెండు ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారంపై గుర్రంపై కూర్చుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న రాజు విగ్రహం ఉంటుంది. దానిని గుర్రాల గేటు అంటారు. ఇక రెండవ ద్వారంపై వేట కుక్కలతో వేటకు వెళుతున్న నూజివీడు రాజు ప్రతిబింబాలు అందులో మనకు దర్శనమిస్తాయి. దానిని కుక్కల గేటు అంటారు. రాజు యుద్ధానికి వెళ్లే సమయంలో గుర్రాల గేటు మీదగా వెళ్లేవారని అందుకనే కోట ద్వారంపై చేతితో కత్తి పట్టుకుని గుర్రం బొమ్మతో ఉన్న రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు స్థానికులు. అదేవిధంగా వేటకు వెళ్లే సమయంలో కోట రెండవ ద్వారమైన కుక్కల గేటు ద్వారా బయటకు వెళ్లేవారు. అందుకే ఆ ద్వారంపై వేట కుక్కలతో వేటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లుండే రాజు బొమ్మలు నిర్మించారని స్థానికులు చెబుతుంటారు.
సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నూజివీడు కోటను నిర్మించారు. ప్రస్తుతం రాజా ధర్మ అప్పారావు భవనాన్ని పీజీ కళాశాల కృష్ణ యూనివర్సిటీగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. పౌరుషాల పోతుగడ్డగా నూజివీడు ఖ్యాతి గణించింది. ఒరిస్సా, ఛత్తీస్గడ్ వరకు నూజివీడు విస్తరించి ఉండేది. ప్రస్తుతం నూజివీడు రెవిన్యూ డివిజన్ స్థాయిలో, నూజివీడు నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా కొనసాగుతుంది. నూజివీడు ప్రాంతంలో శత్రువులను మేకలు తరిమికొట్టాయని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే సాదుజీవిగా కనిపించే మేకలకు కూడా అంతే పౌరుషం ఉంటుందనేది స్ధానికులు కథనం. ఆ క్రమంలోనే మేక అనేది ఇక్కడ జమీందారుల ఇంటిపేరుగా మారిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బాయ్స్ హై స్కూల్, మీర్జాపురం ఎస్టేట్, నూజివీడు కోటలు నేటికీ చెక్కుచెదరకుండా అలనాటి పూర్వ వైభవ చరిత్రను చాటి చెబుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..