Andhra Pradesh: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. ఆయన తనయుడ్ని కూడా అదుపులోకి తీసుకున్న సీఐడీ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో అర్థరాత్రి 2 గంటల సమయంలో అయ్యన్న నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆయనకే నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. క్రైం నంబర్ 64/2022 లో ఐపిసీ సెక్షన్లు 464,467, 471, 474, 120బి కింద అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. ఇంటిగోడ కూల్చివేత విషయంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయ్యన్న కుమారుడు చింతకాయల రాజేశ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు ఉండగా.. రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఏలూరు కోర్టులో వారిని ప్రవేశపెడుతామని చెప్పి తీసుకెళ్లారు పోలీసులు. కానీ ఆయన్ను విశాఖ ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం ఏలూరు తీసుకెళ్తారా? లేక విశాఖలోనే కోర్టులో ప్రవేశపెడతారో వెల్లడించలేదు పోలీసులు.
అయ్యన్నపాత్రుడి అరెస్టుపై మండిపడ్డారు ఆయన సతీమణి. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని నిలదీస్తున్నారు. తాము ఎవరికేం అన్యాయం చేశామని ఇలా చేశారో అర్థంకావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని చెప్పారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వలేదని.. 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. కొంతమంది పోలీసులు మద్యం సేవించి వచ్చారని.. అయ్యన్నకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
అయ్యన్య అరెస్ట్తో నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నర్సీపట్నంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో పాటు పలువురు టీడీపీ నేతలు అయ్యన్న అరెస్ట్ను ఖండించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి