AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే కార్లల్లో దిగారు.. ఎవరూ లేని చోట గుట్టుచప్పుడు కాకుండా పని స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే..

సినిమాల్లో మాత్రమే చూసే గుప్తనిధుల వేట ఇప్పుడు కృష్ణాజిల్లాలో కలకలం రేపింది. కంకిపాడు మండలం పునాదిపాడులోని ఓ పురాతన ఇంటిలో కొందరు వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు చేపట్టడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఖరీదైన కార్లలో వచ్చిన వారు ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో భూమిని పరిశీలిస్తూ తవ్వకాలు జరిపినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. విషయం బయటపడటంతో వారు కార్లు, పరికరాలు అక్కడే వదిలేసి పరారయ్యారు.

ఉదయాన్నే కార్లల్లో దిగారు.. ఎవరూ లేని చోట గుట్టుచప్పుడు కాకుండా పని స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే..
Secret Treasure Hunt
M Sivakumar
| Edited By: |

Updated on: May 13, 2026 | 3:27 PM

Share

సినిమాల్లో మాత్రమే చూసే గుప్తనిధుల వేట.. ఇప్పుడు నిజంగానే కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో కలకలం రేపింది. ఓ పురాతన ఇంటిని టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యక్తులు పట్టపగలే రహస్య తవ్వకాలు చేపట్టడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం ఉదయాన్నే పలు ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఖరీదైన కార్లలో పునాదిపాడు గ్రామం చేరుకున్నారు. వారి చేతుల్లో ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు, తవ్వకాల సామగ్రి ఉండటంతో మొదట నుంచే అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే వారు గ్రామంలోని ఓ పురాతన ఇంటిలోకి వెళ్లి తవ్వకాలు ప్రారంభించారు. ఇంటి ఆవరణలో పెద్ద ఎత్తున గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. ఏదో ప్రత్యేక పరికరాలతో భూమిని పరిశీలిస్తూ.. తవ్వకాలు జరుపుతూ అక్కడే ఏదో వెతుకుతున్నట్టుగా కనిపించారని స్థానికులు చెబుతున్నారు..

అయితే.. ఈ విషయం టీవీ9కు చేరడంతో మా బృందం స్పాట్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించగానే.. తవ్వకాలు చేస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడకుండా ఉండిపోయి.. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడికి వేసుకువచ్చిన కార్లను కూడా అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో అక్కడి సీన్ మరింత హైటెన్షన్‌గా మారింది. గ్రామస్థులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వీడియో చూడండి..

స్థానికులు మాత్రం ఇది గుప్తనిధుల వేటేనని బలంగా అనుమానిస్తున్నారు. పురాతన ఇంటి కింద నిధులు ఉన్నాయన్న సమాచారంతోనే టెక్నాలజీ పరికరాల సహాయంతో తవ్వకాలు చేపట్టినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ వదిలి వెళ్లిన కార్లు, పరికరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన వ్యక్తులు ఎవరు.. అసలు వారు ఏం వెతుకుతున్నారు. నిజంగానే గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగాయా.. అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us