AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దైవనామ స్మరణతో మారుమోగాల్సిన చోట.. హాహాకారాలు-ఆర్తనాదాలు మిన్నంటితే..!

దేవుడిని నమ్మడం, నమ్మిన దేవుడిని ఆరాధించడం సహజం..! ఆవిధంగా భక్తులు గుళ్లూగోపురాలకు పోటెత్తిన సందర్భాలు ట్రాజెడీలుగా ముగియడమే అత్యంత విషాదం. దైవనామ స్మరణతో మారుమోగాల్సిన చోట హాహాకారాలు-ఆర్తనాదాలు మిన్నంటితే అంతకంటే శోకం ఇంకేముంటుంది? మతపరమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికపరమైన సమ్మేళనాలు వికటించి, తొక్కిసలాటకు దారితియ్యడం, వందలమంది మృత్యువాతన పడ్డం.. ఇదొక నిరంతర తంతులా మారుతోందా?

దైవనామ స్మరణతో మారుమోగాల్సిన చోట.. హాహాకారాలు-ఆర్తనాదాలు మిన్నంటితే..!
Stampede
Balaraju Goud
|

Updated on: Nov 01, 2025 | 6:05 PM

Share

దేవుడిని నమ్మడం, నమ్మిన దేవుడిని ఆరాధించడం సహజం..! ఆవిధంగా భక్తులు గుళ్లూగోపురాలకు పోటెత్తిన సందర్భాలు ట్రాజెడీలుగా ముగియడమే అత్యంత విషాదం. దైవనామ స్మరణతో మారుమోగాల్సిన చోట హాహాకారాలు-ఆర్తనాదాలు మిన్నంటితే అంతకంటే శోకం ఇంకేముంటుంది? మతపరమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికపరమైన సమ్మేళనాలు వికటించి, తొక్కిసలాటకు దారితియ్యడం, వందలమంది మృత్యువాతన పడ్డం.. ఇదొక నిరంతర తంతులా మారుతోందా?

ఇదే ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌ పొలిటికల్ ర్యాలీ 40 మందిని మింగేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్రికెటర్ల జైత్రయాత్ర వికటించి 11 మందిని పొట్టనపెట్టుకుంది. ఇంతకుమించిన ఘోరాల్ని కూడా చూసింది ఈ ఏడాది. శ్రీకాకుళం కాశీబుగ్గ నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళా దాకా.. ఈ ఏడాది ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జరిగిన విషాదాల్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం!

జనవరి 29, 2025 – ప్రయాగ్‌రాజ్ః

మహాకుంభమేలాలో మౌని అమావాస్య రోజు అమృత స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందన్న ఆశతో భక్తులు ఎగబడ్డారు. అయితే జనం పెరిగి, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఫిబ్రవరి 16, 2025 – న్యూఢిల్లీః

మహాకుంభమేళా సీజన్‌లోనే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో మరో దుర్ఘటన. ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలు కోసం వేచిచూస్తూ బ్రిడ్జి మీద నుంచి కిందపడి ఐదుగురు చిన్నారులు సహా 18 మంది చనిపోయారు.

జనవరి 8, 2025 – తిరుపతిః

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ఆరుగురు భక్తులు చనిపోయారు. 48 మంది గాయపడ్డారు. టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర నిర్వహణ లోపమే కారణమని తేలింది.

ఏప్రిల్ 30, 2025- సింహాచలంః

అప్పన్న చందనోత్సవానికి భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. భారీ వర్షం కారణంగా గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయారు.

కాశీబుగ్గలో విషాదంః

ఇదిగో ఇప్పుడు మళ్లీ అదే ఆంధ్రప్రదేశ్‌లో సిక్కోలు జిల్లా కాశీబుగ్గలో కార్తీక శనివారాన ఏకాదశి సెంటిమెంట్‌తో మరో విషాదం… తొమ్మిదిమందిని మింగేసింది.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో- NCRB లెక్క ప్రకారం గత పాతికేళ్లలో తొక్కిసలాటల్లో మూడువేల మంది చనిపోయారు. భారత్ దేశంలో అయితే 79 శాతం తొక్కిసలాటలు మత కార్యక్రమాలు, యాత్రా స్థలాల్లోనే సంభవిస్తున్నట్టు డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ రిపోర్ట్‌ లెక్క తేల్చింది.

తొక్కిసలాట ఘటనలుః

>> 1954 ఫిబ్రవరి 3న ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తొక్కిసలాటకు 800 మంది చనిపోయారు.

>> 1999 జనవరి 14, శబరిమలైలో మకరజ్యోతి దర్శనానికి వెళ్లి పంబానది బేస్‌క్యాంపు దగ్గర తొక్కిసలాట జరిగి.. 53 మంది భక్తులు మృత్యువాతన పడ్డారు.

>> అంతకుముందు 2011లో కేరళలోని ఇడుక్కిలో 104 మంది అయ్యప్ప భక్తులు మృతిచెందారు.

>> 2008 సెప్టెంబర్ 30న జోధ్‌పూర్‌ చాముండీదేవి ఆలయంలో 25 వేల మంది భక్తులు ఒకేసారి రావడంతో.. తొక్కిసలాట జరిగి 224 మంది మరణించారు.

>> మహారాష్ట్ర మాంధర్‌దేవి ఆలయంలో 340 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లో నైనాదేవి ఆలయంలో 162 మంది, మధ్యప్రదేశ్‌ రత్నగఢ్‌ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వికటించి 115 మంది, అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా బాణాసంచా పేలుళ్లు అదుపుతప్పి 61 మంది చనిపోయారు.

>> వీటన్నిటికంటే ఘోరం ఏంటంటే, యూపీలోని భోలేబాబా పాదధూళి కోసం ఎగబడి, 125 నిండుప్రాణాలు పోయాయి. పెచ్చుమీరిన వ్యక్తిపూజకు నిలువెత్తు నిదర్శనం ఇది.

>> 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన విషాదం ఇంకా మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగి.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఘటన ఏదైనా తీవ్రత ఎంతదైనా ప్రధాన కారణం మాత్రం ఒక్కటే క్రౌడ్‌మేనేజ్‌మెంట్‌ తెలీకపోవడం. ఒక దుర్ఘటన జరిగితే దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం. అదే నిర్లక్ష్యం మళ్లీమళ్లీ రిపీట్ కావడం. ఫలితం… ముక్తిమార్గం మృత్యుమార్గంగా మారడం.. తీర్ధయాత్రలు విషాదయాత్రలుగా మారడం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us