AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి థింసా నృత్యంతో స్వాగతం..! ఏకంగా 13,500 మందితో..

విశాఖలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆయనకు 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించే కళాఖండాలతో విమానాశ్రయాన్ని అలంకరించగా, బహిరంగ సభలో ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.

ప్రధాని మోదీకి థింసా నృత్యంతో స్వాగతం..! ఏకంగా 13,500 మందితో..
Pm Modi And Thinsa Dance
SN Pasha
|

Updated on: Aug 01, 2026 | 8:12 AM

Share

విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో అపూర్వ స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు ఏకరూప దుస్తుల్లో థింసా నృత్యం ప్రదర్శించనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

10.58 గంటలకు ప్రారంభం

షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అనంతరం 10.58 గంటలకు ప్రధాని నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు.

దాదాపు 12 నిమిషాల పాటు టెర్మినల్‌లో గడపనున్న ప్రధాని, అక్కడ ఏర్పాటు చేసిన తెలుగు కళలు, సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలను తిలకించనున్నారు. అనంతరం టెర్మినల్ నుంచి బహిరంగ సభా వేదికకు చేరుకునే మార్గంలో గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలకనున్నారు. తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఏర్పాట్లపై సీఎం సమీక్ష

ఇదిలా ఉండగా, విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని అలంకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రవేశ ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక కళాకృతి ఏర్పాటు చేయగా, లోపల తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, అలాగే బంగినపల్లి మామిడి వంటి భౌగోళిక గుర్తింపులను ప్రతిబింబించే కళాఖండాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు..

అలాగే 13,500 మంది గిరిజన మహిళలతో నిర్వహించిన థింసా నృత్య రిహార్సల్‌కు గిన్నీస్ వరల్డ్ రికార్డు లభించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ను కూడా విమానాశ్రయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలు ప్రత్యక్షంగా ప్రదర్శించబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంతో విశాఖలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కొత్త మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us