AP – Telangana: ఎండలకు పాఠశాలల్లో పడిపోయిన హాజరు శాతం.. సెలవులు ఇస్తున్నారా..?
రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి అనే వార్త వినగానే.. హమ్మయ్య ఇక ఎండలు నుంచి రిలీఫ్ వస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్. బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల వాన జాడే కనిపించడం లేదు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

జూన్ చివరివారంలో పడుతున్నా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. మిగతా వాళ్లసంగతేమో గాని… స్కూళ్లకెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి. పేరెంట్స్ పిల్లల ఆరోగ్యమా, చదువులా అనే డైలమాతోనే తల్లడిల్లిపోతున్నారు. మండేసూర్యుడు నడినెత్తిన నాట్యమాడేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన పరిస్థితి. ముఖ్యంగా గ్రీష్మతాపంతో తల్లడిల్లిపోతోంది తెలంగాణా. రామగుండంలో నిన్న 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండలకు భయపడి పిల్లల రాక తగ్గిపోవడంతో స్కూళ్లలో హాజరు శాతం దారుణంగా పడిపోతోంది.
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో రెండుపూట్లా బడి నడుస్తోంది. కానీ… 60 శాతానికి మించి విద్యార్థుల్లేరు. కేవలం టీచర్లు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ అదే పరిస్థితి. ఒంటిపూట బడి పెట్టినా స్టూడెంట్స్కి తిప్పలు తప్పడం లేదు. జూన్లో ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి… ఉత్సాహంగా స్కూళ్లకెళ్లాల్సిన పిల్లల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది గ్రీష్మతాపం. అటు.. ప్రైమరీ స్కూల్స్కి పిల్లల్ని పంపడం దాదాపుగా ఆపేశారు పేరెంట్స్.
అటు… ఏపీలో కూడా సేమ్ సిట్యు వేషన్. రాష్ట్రవ్యాప్తంగా మండిపోతున్నాయి ఎండలు. పిల్లలు వడదెబ్బకు గురవుతారని బెంబేలెత్తిపోతున్నారు పేరెంట్స్. చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ బడిబాటకు విరామం కోరుతున్నారు. శనివారంతో ఏపీలో ఒంటిపూట బడులు ముగిసిపోయాయి. ఎండ తీవ్రత తగ్గేదాకా సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్లు. విద్యార్థి సంఘాలు కూడా పేరెంట్స్ ఆందోళనకు సపోర్ట్గా నిలబడుతున్నాయి. మరి ప్రభుత్వం సెలవులు ఇస్తుందా..? లేదా ఒంటి పూట బడులు కొనసాగిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
