Vizag: విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం చుట్టూ రాజకీయం
విశాఖ కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. డబ్బు కోసమే కిడ్నాప్ అని పోలీసులు అంటున్నా.. సెటిల్మెంట్ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

విశాఖపట్నంలో ఎంపీ ఎంవీవీ కుటుంసభ్యులు, ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది. డబ్బు కోసమే జరిగిందని ఇప్పటికే పోలీసులు తేల్చేశారు. అటు ఎంపీ కూడా రౌడీ షీటర్ పక్కా ప్లాన్ చేసి తన కుటుంబసభ్యులను బంధించారని అంటున్నారు. కోటీ 75 లక్షలు ఇచ్చినా 20 కోట్ల కోసం పట్టుబట్టారని ఎంపీ అన్నారు. ఎంపీ కిడ్నాప్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్రాజు. ఎంపి కుటుంబసభ్యులు, ఆడిటర్ జీవీలది కిడ్నాప్ కాదని.. ఇది సెటిల్మెంట్ వ్యవహారంలో భాగమే అంటూ అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ నేత. కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందని.. దీనిపై సిబిఐ లేదా NIAతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ కూడా చెప్పుకోలేని విషయాలు ఏవో దాగి ఉన్నాయన్నారు విష్ణుకుమార్రాజు. అంతేకాదు డబ్బు కోసమే అయితే రిజిస్ట్రార్ను ఎందుకు పిలిపించాలని చూశారని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే.
విశాఖపట్నం కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరించారన్నారు. విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా ఇందులో మరో కొత్త కోణం ఒకటి తెరమీదకు వచ్చింది. కిడ్నాప్ ఛేదించిన తర్వాత ఎంపీతో హేమంత్కు ఎలాంటి సంబంధాలు లేవంటూ ప్రకటించారు. కానీ గతంలో తన స్టిక్కర్ వాడటంతో పాటు.. రిషికొండ ల్యాండ్ డీల్లో తనకు మధ్యవర్తిగా వ్యవహరించారని ఎంపీ టీవీ9తో అన్నారు.
అంతేకాదు కిడ్నాపర్లు సబ్ రిజిస్ట్రార్ ను రప్పించాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఖచ్చితంగా ల్యాండ్ డీల్ లో భాగంగానే కిడ్నాప్ జరిగిందని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
