Andhra Pradesh: ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
విద్యాబుద్ధులు నేర్పాల్సిన కాలేజీ చైర్మనే కాలయముడయ్యాడు.. తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చైర్మన్ ప్రవీణ్ కుమార్ లైంగిక వేధింపులు, కెరీర్ నాశనం చేస్తాననే బెదిరింపులే ఆ యువతి ప్రాణం తీశాయా? పోలీసులకు చిక్కిన ఆ సూసైడ్ నోట్లో ఏముంది..?

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని బ్లిస్ హోటల్ వెనుక ఉన్న బాలాజీ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న దీశ్మాంజలి, హాస్టల్ గదిలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది కేవలం ఆత్మహత్య కాదని, కాలేజీ చైర్మన్ చేసిన లైంగిక వేధింపులే ఆమెను మృత్యువు వైపు నెట్టాయని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీకాళహస్తికి చెందిన పద్మమ్మ, రమణయ్య దంపతులు కూలీ పనులు చేసుకుంటూ తమ బిడ్డ దీశ్మాంజలిని నర్సింగ్ చదివిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కష్టాలు తీరుస్తుందనుకున్న బిడ్డ, కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్ల విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చైర్మన్ వేధింపులు.. బెదిరింపులు
దీశ్మాంజలి గత కొన్ని రోజులుగా కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు చెబితే నీ కెరీర్ నాశనం చేస్తానని, లైఫ్ స్పాయిల్ చేస్తానని చైర్మన్ తనను బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం దీశ్మాంజలి మాత్రమే కాదు, హాస్టల్లోని ఇతర పేద విద్యార్థినులను కూడా చైర్మన్ ప్రవీణ్ లైంగికంగా వేధిస్తున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించడం ఈ కేసులో తీవ్రతను పెంచుతోంది.
పోలీసుల దర్యాప్తు.. చైర్మన్పై కేసు నమోదు
విద్యార్థిని ఆత్మహత్యతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలాజీ నర్సింగ్ కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునే సమయంలో దీశ్మాంజలి ఎవరికో వీడియో కాల్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
చైర్మన్ అసభ్యకర ప్రవర్తన వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం కాలేజీ రికార్డులను, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.
