Andhra Pradesh: తిరుపతి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో బస్సు.. స్పాట్లోనే..
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలాయపల్లి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇంజిన్ భాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని చుట్టేయడంతో ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి.

తిరుపతి జిల్లా బాలాయపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బాలాయపల్లి సమీపంలో ప్రయాణిస్తుండగా ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి.
బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేస్తూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒక ప్రయాణికుడు బస్సులోనే చిక్కుకుపోయి మరణించారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
