భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..
భార్య కాపురానికి రాలేదనే ఆవేదనతో అదుపు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి… కారుతో రోడ్డుపై భీభత్సం సృష్టించాడు. ఒకేరోజు రెండు చోట్ల ప్రమాదాలకు కారణమై… ఒకరి ప్రాణం తీసి, మరికొందరిని తీవ్రంగా గాయపరిచిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. .. ..

భార్య కాపురానికి రాలేదనే ఆవేదన.. ఓ వ్యక్తిని అదుపు తప్పేలా చేసింది. కారుతో రోడ్లపై భీభత్సం సృష్టించి.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై ఈ ఘటనలు వరుసగా జరిగాయి. మొదట దువ్వూరు సమీపంలో టూ వీలర్పై వెళ్తున్న వారిని కారు ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడితో ఆగని ఆ వ్యక్తి.. చాపాడు మండలం పల్లవోలు వద్ద మరో ప్రమాదానికి కారణమయ్యాడు. మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న కొండయ్య అనే వ్యక్తిని ఢీకొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ రెండు ఘటనలతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. కారును నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను కడప నగరంలోని అక్కాయపల్లెకు చెందిన కొట్టే ప్రశాంత్గా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రశాంత్.. తన భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో ఆవేశంగా కారును అధిక వేగంతో నడిపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత సమస్యతో ఆవేశానికి లోనై.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
Also Read: నా భార్యకు అబార్షన్ అయినప్పుడు ఆ హీరో ఫోన్ చేసి చెప్పిన మాటకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..
