AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఉచిత బస్సు పథకం రద్దు..? క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్..

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ వార్తలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Andhra Pradesh: ఏపీలో ఉచిత బస్సు పథకం రద్దు..? క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్..
Apsrtc
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 5:20 PM

Share

ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారనే వార్తలపై కూటమి సర్కార్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం వర్తింపచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఇటీవల దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అవకాశం అందిస్తోంది. అయితే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం క్లారిటీ

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు ప్రయాణ ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేస్తోందని, డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా తెస్తున్న ఈ-బస్సుల వల్ల ఈ పథకం కనుమరుగవుతుందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేయడం లేదు. గత 9 నెలల్లో మహిళలు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా.. దీనికి సంబంధించిన రూ. 2,350 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది. ఇప్పటికే రూ.720 కోట్లను ఆర్టీసీకి తిరిగి చెల్లించింది. ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ 60 శాతం నుండి 92 శాతానికి పెరిగి సంస్థ ఆదాయం కూడా మెరుగైంది. ఇందులో టికెట్ కొని ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా 40 శాతంగా ఉంది. ఆర్టీసీ బస్సులను ఎంచుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల సంఖ్య 39 శాతానికి తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి తేవటం కోసం కేంద్ర సహకారంతో 1,450 కొత్త ఈవీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తెస్తోంది. కొత్త బస్సుల రాక ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు అందించటం కోసమే తీసుకొస్తున్నాం. వైరల్ అవుతున్న రద్దు వార్తలు కేవలం అపోహలు మాత్రమే” అంటూ పేర్కొంది.

ఊహాగానాలకు చెక్

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపర్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. దీంతో లక్షలాది మంది మహిళలు తరచూ బస్సులో ప్రయాణిస్తున్నారు. దీంతో రద్దు చేసే అవకాశమే లేదని ప్రభుత్వం చెబుతోంది.

ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దు చేయం

Follow Us