Kadapa: తిరుపతికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం.. వీడియో..
కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఎగబడ్డారు. బిందెలు, బకెట్లు, బాటిల్లు, డ్రమ్ములతో ట్యాంకర్లోని నెయ్యిని తోడేసి తీసుకెళ్లారు. దాదాపు 21 వేల లీటర్ల నెయ్యిలో 500 లీటర్లు మాత్రమే మిగిల్చారు. పోలీసులు చేరుకునేలోపు ఎక్కువ భాగం నెయ్యి తీసుకెళ్లడంతో భారీ నష్టం జరిగింది.

పెట్రోల్ ట్యాంకులు, ఆయిల్ ట్యాంకులు బోల్తా పడినప్పుడు సర్వసాధారణంగా అక్కడ ఉన్న స్థానికులు.. అందులోని చమురును బిందెలలో పట్టుకొని వెళ్లిన ఇన్సిడెంట్స్ చాలాసార్లు జరిగాయి. అయితే ఈసారి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఎగబడ్డారు. అందులో ఉన్న నెయ్యి అంతా ఖాళీ చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నెయ్యి అంతా కింద పడుతూ ఉండడంతో స్థానికులు ఆ నెయ్యి ట్యాంకర్ వద్దకు ఎగబడి వచ్చారు. బిందెలు, బకెట్లు, చెంబులు, వాటర్ బాటిల్లు.. కొంతమంది అయితే ఏకంగా డ్రమ్ములతో నెయ్యిని తోడేశారు. ఏ వస్తువు అందితే దానితో.. నెయ్యిని తీసుకువెళ్లిపోవడంతో ట్యాంకర్ ఖాళీ అయింది.. ఈలోపు స్పందించిన పోలీసులు అక్కడకు చేరుకొని వారిని నియంత్రించారు. అయితే ఈలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. పూణే నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్న ట్యాంకర్ కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో బోల్తా పడింది. స్థానికులు ట్యాంకర్లోని దాదాపు 21 వేల లీటర్ల నెయ్యిని తోడేశారు. చివరకు అందులో 500 లీటర్లు మాత్రమే మిగిల్చారు.
Also Read: మీరు కోళ్ల ఫారం పెట్టాలనుకుంటే రూ.50 లక్షల రుణం.. అందులో 50 శాతం రాయితీ
