ముద్రగడపై ఫ్లెక్సీలు.. గోదావరి జిల్లాల్లో తెరపైకి సరికొత్త రాజకీయం..
ముద్రగడను తూర్పుగోదావరి నేతలు ఇప్పట్లో వదిలేలా లేరు. మొన్నటివరకు జనసేన కార్యకర్తలు, ఇప్పుడు కాపు సంఘం నేతలు తోడయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కాపు రిజర్వేషన్లు, స్పెషల్ స్టేటస్ సాధించాలన్న ముద్రగడ కామెంట్లపై విరుచుకుపడుతున్నారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపు రిజర్వేషన్ల సంగతి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముగిసినా తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు ఇంకా హాట్ హాట్గానే ఉన్నాయి.
![ముద్రగడపై ఫ్లెక్సీలు.. గోదావరి జిల్లాల్లో తెరపైకి సరికొత్త రాజకీయం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/mudragada-padmanabham.jpg?w=1280)
ముద్రగడను తూర్పుగోదావరి నేతలు ఇప్పట్లో వదిలేలా లేరు. మొన్నటివరకు జనసేన కార్యకర్తలు, ఇప్పుడు కాపు సంఘం నేతలు తోడయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కాపు రిజర్వేషన్లు, స్పెషల్ స్టేటస్ సాధించాలన్న ముద్రగడ కామెంట్లపై విరుచుకుపడుతున్నారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపు రిజర్వేషన్ల సంగతి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముగిసినా తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు ఇంకా హాట్ హాట్గానే ఉన్నాయి. ప్రధానంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం సెంట్రిక్గా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ తరపున పనిచేసిన ముద్రగడ.. పవన్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి, పవన్తో సహా జనసేన సూపర్ విక్టరీతో.. ముద్రగడ సవాల్ను గుర్తుచేస్తూ.. జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించడంతో.. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎన్నికల సమయంలో పవన్ను నానా మాటలు అన్నారని.. మొన్నటి వరకు జనసేన కార్యకర్తలు ముద్రగడను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఉత్తరాలు కూడా రాశారు. జనసేన కార్యకర్తల వేధింపులపై స్వయంగా ముద్రగడే బయటకు వచ్చి.. ఇక ఆపండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. వేధించడం కంటే.. ఎవరినైనా పంపి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో.. ఎన్నికల్లో గెలిచిన పవన్కు అభినందనలు చెప్తూ.. కాపు రిజర్వేషన్, స్పెషల్ స్టేటస్ తేవాలని డిప్యూటీ సీఎం పవన్ను కోరారు. ఇదే ఇప్పుడు.. మరో రచ్చకు దారి తీసింది.జనసేన కార్యకర్తలకు.. ఇప్పుడు కాపు సంఘం నాయకులు కూడా తోడయ్యారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ మా కాపు రిజర్వేషన్ల అంశం మీకెందుకు అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదో ముద్రగడను ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు.. ఇడబ్ల్యూఎస్ కింద ఐదు శాతం వాటా ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ఈడబ్ల్యూఎస్ వాటా తీసేస్తే ఎందుకు మాట్లాడలేదని, విద్యుత్ చార్జీలు పెంచితే ఎందుకు ఉద్యమించలేదని ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు కాపు సంఘం నేతలు. పవన్ సొంత డబ్బులను కౌలు రైతులకు పంచారని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న చంద్రబాబుపై ఎందుకంత ద్వేషం అని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ముద్రగడ లేఖలు రాయడం, ప్రశ్నించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు కాపు సంఘం నేతలు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు తమ రిజర్వేషన్లు, హక్కులపై మాట్లాడే హక్కు లేదంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..