Andhra Pradesh: 15 నెలల సంజనకు కొత్త కుటుంబం.. శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా శిశు దత్తత జరిగింది. కోనసీమ శిశు గృహం నుండి 15 నెలల చిన్నారి సంజనను కేరళ దంపతులు CARA పోర్టల్ ద్వారా దత్తత తీసుకున్నారు. ఈ చారిత్రక ఘట్టం రాష్ట్రంలో బాలల సంరక్షణ, దత్తత ప్రక్రియలకు కొత్త ఊపిరి పోసింది. దత్తత తర్వాత కూడా శిశువు భద్రత పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు, ఇది బాలల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోనసీమ శిశు గృహం ద్వారా తొలిసారిగా ఒక ఆడశిశువును దత్తతకు ఇచ్చినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కేరళకు చెందిన దంపతులు CARA (Child Adoption Resource Authority) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి, 15 నెలల చిన్నారి సంజనను బుధవారం వారికి అప్పగించారు. ఈ దత్తత అనుబంధం రాష్ట్రంలో శిశు సంరక్షణ మరియు దత్తత విధానంలో ఒక సానుకూల ప్రగతిని సూచిస్తున్నదని కలెక్టర్ అన్నారు.
కోనసీమ శిశు గృహ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 15 నెలల పాప సంజనను దేశవ్యా ప్తంగా పిల్లలు లేని దంపతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ప్రాధాన్యతలో కేరళకు చెందిన బాదుషా సమీనా దంపతులు ఎంపికయ్యారు. పిల్లలు లేని దంపతులు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న కేరళ దంపతులను ఎంపిక చేసింది న్యూఢిల్లీ CARA సంస్థ.. కలెక్టర్ మహేష్ కుమార్, చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లలను ఆ తల్లిదండ్రులు తమ సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకోవాలని, వారి భవిష్యత్తు కోసం మంచి మార్గాలు ఏర్పరచాలని సూచించారు. దత్తత తర్వాత కూడా శిశువు భద్రత, క్షేమాన్ని కంట్రోల్ చేయడం కోసం అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తారని అన్నారు.
CARA ద్వారా సరైన దత్తత ప్రక్రియలు తీసుకోవడం వల్ల, చిన్నారుల భవిష్యత్తు మరింత సురక్షితం అవుతుందని అధికారులు అన్నారు. ఇదే విధంగా, దేశంలో చిన్నారులకు మంచి, ప్రేమతో కూడిన కుటుంబాలను కల్పించడం ద్వారా సామాజిక సవాళ్లను తగ్గించగలమని కలెక్టర్ తెలిపారు. ఈ దత్తత, కోనసీమలో శిశు సంరక్షణ రంగంలో కొత్త దిశను తీసుకువచ్చిందని, ఇతర కుటుంబాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని సమాచారం. ఆడపిల్లలు పుడితే భారంగా కొందరు తల్లితండ్రులు భావిస్తుంటే, ఆడపిల్ల కావాలని వెతుకుంటూ వచ్చిన కేరళా దంపతులను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




