రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు రావాలంటే ఇవి తప్పనిసరి..
PM Kisan: అన్నదాతలకు కేంద్రం నుంచి హోలీ కానుక అందనుందా? పీఎం కిసాన్ 21వ విడత సక్సెస్ఫుల్గా అందుకున్న రైతులు.. ఇప్పుడు 22వ విడత కోసం ఎదరుచూస్తున్నారు. మార్చిలో మీ ఖాతాల్లోకి రూ.2,000 జమ కావాలంటే మీరు చేయాల్సిన ఆ ఒక్క పని ఏంటి? అసలు ఏ తేదీన డబ్బులు వచ్చే అవకాశం ఉంది? అనేది తెలుసుకుందాం..

దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటికే 21 విడతల డబ్బులను విజయవంతంగా అందుకున్న రైతులు, ఇప్పుడు 22వ విడత కోసం వేయీ కళ్లతో ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
మార్చిలో అన్నదాతల ఖాతాల్లోకి నగదు
పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున ఏడాదికి రూ. 6000 రైతులకు అందుతాయి. గత 21వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19, 2025న కోయంబత్తూరు వేదికగా విడుదల చేశారు. ఆ లెక్కన తదుపరి నాలుగు నెలల కాల పరిమితి ముగిసే మార్చి 2026లో 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
21 విడతల్లో రూ. 4 లక్షల కోట్ల పంపిణీ
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరింది. గత విడతలోనే రూ. 18,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు రూ. 4 లక్షల కోట్లను కేంద్రం రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం గమనార్హం.
e-KYC లేకపోతే డబ్బులు రావు..
22వ విడత ప్రయోజనం పొందాలనుకునే రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది.
- మీ ఆధార్ కార్డును పీఎం కిసాన్ పోర్టల్తో లింక్ చేయాలి.
- భూమి రికార్డుల వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి.
- ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోతే, మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నా డబ్బులు జమ కావు.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమ మొబైల్ నుంచే చెక్ చేసుకోవచ్చు..
- పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ([pmkisan.gov.in](https://pmkisan.gov.in)) సందర్శించండి.
- Know Your Status ఆప్షన్పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.
- అక్కడ మీ e-KYC , ల్యాండ్ సీడింగ్ స్టేటస్ Yes అని ఉందో లేదో సరిచూసుకోండి.
