Andhra: హైవేపై దూసుకెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి.. ఏం జరిగిందంటే.?
విజయనగరం హైవేపై ఒక్కసారిగా వాహనాలు ఆగిపోయాయి. ఉరుకులు, పరుగుల ప్రయాణీకులు తమ వాహనాలను వదిలేసి.. రోడ్డుపైకి వచ్చేసారు. ఇక వారందరికీ రోడ్డు మీద కనిపించింది చూడగా దెబ్బకు మైండ్ పోయింది. ఇంతకీ వారికి అక్కడ ఏం కనిపించింది.? ఆ వివరాలు ఇలా.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణంతో ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఓ వైపు వర్షం వేసవితాపంనుంచి కాస్త ఉపశమనం కలిగించినా.. మరోవైపు అకాల వర్షానికి పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వనాల్లో ఉండాల్సిన సరీసృపాలు రోడ్లపైకి వస్తున్నాయి. మండుటెండల్లో కురిసిన వర్షానికి భూతాపం పెరగడంతో పుట్టల్లో ఉండాల్సిన పాములు బయటకు వచ్చాయి. అలా బయటపడిన ఓ నాగుపాము ఓ హైవేపై పడగవిప్పి కూర్చుని ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం గ్రీన్ ఫీల్డ్ హైవే రింగ్ రోడ్డుపై త్రాచుపాము హల్చల్ చేసింది. రోడ్డుపై తెలుపు, గోధుమవర్ణం కలగలిసిన దాదాపు 10 అడుగుల నాగుపాము రోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతూ కూర్చుంది. రాత్రివేళ హైవేపైదూసుకెళ్తున్న వాహనాల వెలుగులో రోడ్డుపై మెరుస్తూ కనిపించిన నాగుపామును చూసి ఒక్కసారిగా వాహనదారులు తమ వెహికల్స్ను ఆపేశారు. అయితే ఆ నాగుపాము ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఈ క్రమంలో చుట్టలా చుట్టుకొని పడగవిప్పి బుసలు కొడుతూ రోడ్డుపై కూర్చుని అందరినీ పరిశీలనగా చూస్తున్న నాగుపామును స్థానికులు తమ మొబైల్స్లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తీసుకున్నవాడికి తీసుకున్నన్ని వీడియోలు..ఫోటోలు అన్నట్టుగా వారందరికీ ఆ నాగుపాము తనదైనస్టైల్లో ఫోజులిచ్చింది. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి