Power Charges: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు బంపర్ న్యూస్.. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం.. ఎంతంటే..?
ఏపీ ప్రజలకు శుభవార్త. కరెంట్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నాయి. ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీంతో యూనిట్కు 13 పైసలు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో..

ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ భారీ గుడ్న్యూస్ అందించింది. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ట్రూ డౌన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూనిట్పై విద్యుత్ చార్జీలు 13 పైసలు తగ్గనుంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ సుంకాన్ని తగ్గించినట్లు ఆయన తెలిపారు. దాదాపు రూ.4,498 కోట్ల విలువైన విద్యుత్ బకాయిలను భరించాలని తాము నిర్ణయం తీసుకున్నామని, దీని ఫలితంగా కరెంట్ ఛార్జీలు తగ్గనున్నట్లు గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలను అసలు పెంచమని తెలిపారు.
ఐదేళ్లల్లో విద్యుత్ ఛార్జీలు పెంచం
గృహలు, రైతులు, పరిశ్రమలపై ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు తాము ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలను భరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని, ప్రజలకు ఉపయోగపడేలా విద్యుత్ రంగంలో నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లల్లో అవినీతికి పాల్పడి పదే పదే చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసిందని విమర్శించారు. ప్రస్తుతం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం వెళ్తుందని, భవిష్యత్తుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచమన్నారు.
రైతులకు 75 వేల కనెక్షన్లు
విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్లో 132/33 కేవీ సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ కార్యదర్శి కె విజయానంద్, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ సబ్స్టేషన్ వల్ల ఎయిర్పోర్టుతో పాటు రెండు మండలాలు, సమీప గ్రామాలకు నిరంతరం కరెంట్ సరఫరా అందతుందన్నారు. దీని వల్ల గంగూర్ సబ్ స్టేషన్పై భారం తగ్గుతుందని అన్నారు. అటు రైతులకు 75 వేల కంటే ఎక్కువ ఎక్కువ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశామని, పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
