AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!

మరికొన్ని గంటల్లో భేటీకానున్న ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అన్న చంద్రబాబు.. వాటి నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆరు గ్యారంటీల అమలుపై ఏం తేల్చనున్నారు..? ఏపీ కేబినెట్‌ తొలి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!
Chandrababu Naidu Cabinet
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Jun 24, 2024 | 8:56 AM

Share

మరికొన్ని గంటల్లో భేటీకానున్న ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అన్న చంద్రబాబు.. వాటి నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆరు గ్యారంటీల అమలుపై ఏం తేల్చనున్నారు..? ఏపీ కేబినెట్‌ తొలి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లో నయా సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతోపాటు స్పీకర్‌ ఎన్నిక కూడా పూర్తైపోయింది. ఇక ఇప్పుడు కేబినెట్‌ మీటింగ్‌కు టైమ్‌ వచ్చేసింది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత జరగనున్న మొదటి కేబినెట్‌ మీటింగ్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెబుతున్న చంద్రబాబు.. తొలి కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్నది చర్చనీయాంశమైంది.

మొదటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు స్థితిగతులతో పాటు ఆరు గ్యారంటీలపైనా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావిస్తున్న బాబు సర్కార్‌.. దానిపైనా ఓ క్లారిటీకి రానుంది. అంతేకాదు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారట సీఎం చంద్రబాబు. మరోవైపు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టే అంశంపైనా కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏపీకి ఉన్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను ఎలా తెచ్చారు.. ఎలా ఖర్చు పెట్టారు.. ఆ నిధులన్నీ ఏమైపోయాయన్న దానిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే ఛాన్స్‌ ఉంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వసం జరిగిందని టీడీపీ, జనసేన నేతలు పదేపదే అంటున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ విధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఇక జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో.. దానిపైనా మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం చంద్రబాబు.

మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మంత్రివర్గ సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి చూడాలి ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం నుంచి ఎలాంటి నిర్ణయాలొస్తాయో…!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..