Jawad Cyclone Highlights: తుపానుగా మారిన తీవ్రవాయుగుండం.. జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్‌..

| Edited By: Anil kumar poka

Updated on: Feb 19, 2022 | 6:49 PM

Jawad Cyclone Live: జెట్‌ స్పీడ్‌తో జవాద్‌ వచ్చేస్తోంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి ఇంకా కేవలం 420 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో జొవాద్‌ దూసుకువస్తోంది. మరో ఆరు గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతోపాటు ఒడిషాపై దాడి చేయనుంది.

Jawad Cyclone Highlights: తుపానుగా మారిన తీవ్రవాయుగుండం.. జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్‌..
Jawad Cyclone Live

Jawad Cyclone Live: ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ జవాద్ తుపాను విశాఖకు ఆగ్నేయంగా 360కి.మీ, ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 470 కి.మీ, పారాదీప్ కు దక్షిణ నైరుతిగా 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఆ తదుపరి ఉత్తర ఈశాన్య వైపు దిశను మార్చుకుని కదులుతూ ఒడిశా తీరం వెంబడి పూరి దగ్గరకు చేరనుంది.

గతకొన్ని రోజుల క్రితం వచ్చిన తుపాన్‌ కారణంగా రాయలసీమ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు జొవాద్‌ తుపాన్‌ ఏపీవైపు దూసుకొస్తోంది. ఈ తుపాన్‌ కారణంగా ఉత్తరాంధ్రకు పెను ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారింది.

ఇదిలా ఉంటే డిసెంబర్‌ 1న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రానున్న 12 గంటల్లో వాయు గుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అనంతరం 24 గంటల తర్వా వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి..

ఏపీవైపు దూసుకొస్తున్న జవాద్‌ తుపాన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Dec 2021 07:49 PM (IST)

    వెంటాడుతున్న రెయిన్ ఫీయర్..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెయిన్ ఫీయర్ వెంటాడుతోంది. మొన్న రాయలసీమలో వరుణుడు సృష్టించిన బీభత్సాన్ని మరువక ముందే.., ఇప్పుడు మరో జల ముప్పు ముంచుకొస్తోంది. ఉత్తరాంధ్రపై విరుచుకుపడేందుకు జొవాద్‌ తుఫాన్‌ దూసుకువస్తోంది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. జొవాద్ ఎఫెక్ట్‌తో స్టేట్‌వైడ్‌గా ఏపీ హైఅలర్ట్ ప్రకటించింది.

  • 03 Dec 2021 07:33 PM (IST)

    తుపాను హెచ్చరికల నేపథ్యంలో..

    జవాద్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు. అనకాపల్లి, ఎస్. రాయవరం, చీడికాడ మండలాల్లో పోలీసులు, మహిళా పోలీసులతో శారదానది, ఆవఖండం, ఏలేరు కాలువ, కోణం రిజర్వాయర్, బంగారమ్మ పాలెం, రేవుపోలవరం సముద్రతీర ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోకి ప్రజలను అనుమతి ఇవ్వడంలేదు. సమీప గ్రామాల ప్రజలను లోతట్టు, కొండవాలు ప్రాంత ప్రజలు అప్రమత్తం చేశారు పోలీసులు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలకు సూచనలు జారీ చేశారు.

  • 03 Dec 2021 06:07 PM (IST)

    తుపానుగా మారిన తీవ్రవాయుగుండం..

    ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుపానుగా మారిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ జవాద్ తుపాను విశాఖకు ఆగ్నేయంగా 360కి.మీ, ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 470 కి.మీ, పారాదీప్ కు దక్షిణ నైరుతిగా 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు.

  • 03 Dec 2021 05:24 PM (IST)

    రాకాసి అలలతో అల్లకల్లోలంగా బంగాళాఖాతం

    జొవాద్‌ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భయానకంగా ఏర్పడింది. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయి.

  • 03 Dec 2021 05:23 PM (IST)

    రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు..

    రానున్న 12 గంటల్లో తుఫాను మరింతగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. విశాఖకు ఆగ్నేయంగా 420 కిలో మీటర్ల దూరంలో ఉన్న 'జొవాద్‌' తుపాను, రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలి తీవ్రత పెరగనుందని వెల్లడించారు అఫీసర్లు.

  • 03 Dec 2021 05:22 PM (IST)

    త్తరాంధ్రను వణికిస్తోన్న జొవాద్​.. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం సమీక్ష

    జొవాద్​ తుఫాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ముప్పు తీరం వైపు దూసుకొస్తోందన్న జొవాద్​ వార్నింగ్ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు శ్రీకాకుళం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. జొవాద్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్‌, అధికారులకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం.

  • 03 Dec 2021 05:20 PM (IST)

    వరద బాధితుల సహయార్ధం మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు కోటి రూపాయలు విరాళం

    ఏపీ సీఎం జగన్‌ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. జొన్నవాడలోనూ పర్యటించారు. ఆ తర్వాత నెల్లూరు టౌన్‌ భగత్‌సింగ్ కాలనీకి వెళ్లారు. బాధితుల దగ్గరకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. మరోవైపు వరద బాధితుల సహయార్ధం కోటి రూపాయలు విరాళం ఇచ్చారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు. నెల్లూరు పర్యటనలో ఉన్న సీఎం జగన్‌కు చెక్కును అందించారు.

  • 03 Dec 2021 05:17 PM (IST)

    సిక్కోలుపై తుఫాన్‌ ఎఫెక్ట్‌..

    శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. సిక్కోలుపై తుఫాన్‌ ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికలతో NDRF బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

  • 03 Dec 2021 04:24 PM (IST)

    ‘జొవాద్’ అంటే..

    బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపానుగా మారితే దీనిని ‘జొవాద్’ అని పిలవనున్నారు. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం గణనీయంగా ఏపీ, ఒడిశాలపై ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, ‘జొవాద్’ అనే పేరును సౌదీ అరేబియా సూచించింది. అరబిక్ భాషలో ‘జవాద్’ అంటే గొప్పది,’ఉదార’, ‘దయగల’ అనిఅర్థాలున్నాయి.

  • 03 Dec 2021 04:00 PM (IST)

    ఓఖీ తుఫాను విధ్వంసంతో..

    2017లో వచ్చిన ఓఖీ తుఫాను తన విధ్వంసాన్ని వీడిపోయింది. నైరుతి భారతదేశం, శ్రీలంక, మాల్దీవులలో తుఫాను ప్రభావం కనిపించింది. ఓఖీ హరికేన్ నవంబర్ 29న శ్రీలంక ఆగ్నేయ తీరంలో ఏర్పడటం ప్రారంభించింది. ఓఖీ భారీ విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫానులో 318 మంది మరణించారు. ఇందులో ఒక్క భారతదేశంలోనే 218 మంది మరణించారు. శ్రీలంకకు చెందిన 27 మంది కూడా మరణించారు.

  • 03 Dec 2021 03:59 PM (IST)

    2016న ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేసిన వర్దా తుఫాన్..

    ప్రమాదకరమైన తుఫానులలో వర్దా తుఫాన్ కూడా ఒకటి. వర్దా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను. ఇది 12 డిసెంబర్ 2016న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకింది. పాకిస్తాన్ చేత 'వర్దా' అని పేరు పెట్టారు, అంటే ఎర్ర గులాబీ.

    చెన్నైలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దీని వేగం 130 కిలోమీటర్లకు చేరుకుంది. తుపాను కారణంగా వేలాది నటీనటుల పంటలు నాశనమయ్యాయి. లక్షల చెట్లు నేలకూలాయి. 10 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీని కారణంగా 47 మంది మరణించారు. కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ తుఫాను కారణంగా చెన్నై, అండమాన్ నికోబార్‌లలో అత్యధికంగా విధ్వంసం సంభవించింది. శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా తదితర దేశాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది.

  • 03 Dec 2021 03:57 PM (IST)

    2014లో ముంచేసిన హుధుద్ తుఫాను

    దేశంలో సంభవించే ప్రమాదకరమైన తుఫానులలో హుద్‌హుద్ తుఫాను కూడా ఉంది. హుద్‌హుద్ ఒక ఉష్ణమండల తుఫాను, ఒమన్‌చే హుద్‌హుద్ అనే పక్షి పేరు పెట్టారు. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుదూహుద్ తుఫాను దేశంలో పెను విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను గంటకు 215 కిలోమీటర్ల వేగంతో విశాఖపట్నంను తాకింది.

    హుద్‌హుద్ తుపాను అక్టోబర్ 6న అండమాన్ సముద్రం నుంచి ఉద్భవించి అక్టోబర్ 8న తుపానుగా మారింది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాను తీవ్రంగా ధ్వంసం చేసింది.

    ఆంధ్రాతోపాటు పలు రాష్ట్రాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా 124 మంది చనిపోయారు. ఈ తుఫాను ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో కూడా కనిపించింది. అక్కడ 18 మంది మరణించారు. ఈ విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల సహాయ ప్యాకేజీని జారీ చేసింది.

  • 03 Dec 2021 03:55 PM (IST)

    డేంజరస్ సైక్లోన్ టౌక్టే కూడా ఇక్కడే..

    డేంజరస్ సైక్లోన్ టౌక్టే కూడా దేశంలోని ప్రమాదకరమైన తుఫానులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ తుపాను మహారాష్ట్ర, గుజరాత్‌లలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను ఈ ఏడాది మే 14న వచ్చింది. తుపాను వేగం గంటకు 220 కిలోలకు చేరువైంది. తుఫానులో 170 మందికి పైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కనిపించకుండా పోయారు. ఈ తుపాను కారణంగా 15 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. తుఫాను ప్రభావం చాలా విస్తృతంగా ఉంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని అనేక నగరాలు ప్రభావితమయ్యాయి. ఆ సమయంలో భారీ వర్షాలు కురిశాయి.

  • 03 Dec 2021 03:53 PM (IST)

    అత్యంత ప్రమాదకరమైన తుఫానులలో సూపర్ సైక్లోన్ ఒకటి.. ఎప్పుడు వచ్చిందంటే..

    భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన తుఫానులలో ఒకటి సూపర్ సైక్లోన్.. దీనిని ఒడిశా తుఫాను అని కూడా పిలుస్తారు. ఈ తుఫాను 1999లో వచ్చింది. ఈ తుఫాను భారత్‌లో పెను విధ్వంసం సృష్టించింది. అక్టోబరు 25, 1999న అండమాన్ సముద్రం నుంచి ఉద్భవించిన సూపర్ సైక్లోన్.. గంటకు 260 కి.మీ వేగంతో దాడి చేసింది. సూపర్ సైక్లోన్ ఒడిశాలో అత్యంత విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా 18 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒడిశాలో సూపర్ సైక్లోన్ కారణంగా 9,887 మంది మరణించారు.రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్‌లోనే 8 వేల మందికి పైగా మరణించారు.

    ఇంతకంటే ఎక్కువ మంది చనిపోయారని అప్పటి పత్రికల్లో వచ్చింది . ఈ తుపాను కారణంగా దాదాపు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. భారత్‌తో పాటు పొరుగు దేశాలైన మయన్మార్‌, బంగ్లాదేశ్‌తో పాటు థాయ్‌లాండ్‌లో కూడా ఈ తుఫాను ప్రభావం చూపింది. తుఫాను కారణంగా సంభవించిన విధ్వంసం దృష్ట్యా, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా సహాయం చేశాయి.

  • 03 Dec 2021 03:43 PM (IST)

    ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ టీమ్స్‌ రెడీగా ఉండాలి.. జవాద్‌ తుఫాన్‌పై ప్రధాని మోడీ సమీక్ష

    జవాద్‌ తుఫాన్‌పై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్‌తోపాటు నేవీ హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డ్‌, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ టీమ్స్‌ రెడీగా ఉండాలని సూచించారు.

  • 03 Dec 2021 03:42 PM (IST)

    జొవాద్ ఎఫెక్ట్‌తో స్టేట్‌వైడ్‌గా ఏపీ హైఅలర్ట్

    జొవాద్ ఎఫెక్ట్‌తో స్టేట్‌వైడ్‌గా ఏపీ హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రమంతటా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. జొవాద్ ఎఫెక్ట్ అధికంగా ఉండే ఉత్తరాంధ్రలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈరోజు, రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విశాఖలో అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేశారు.

  • 03 Dec 2021 03:37 PM (IST)

    ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చంటున్న ఐఎండీ

    జొవాద్‌ విధ్వంసం ఏ స్థాయిలో ఉండనుందో ఊహించడం కూడా కష్టమే. ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్రలో మినిమం 7 సెంటీమీటర్ల నుంచి మాగ్జిమమ్‌ 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. ఐఎండీ వార్నింగ్‌ను చూస్తుంటే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రమాదం జరిగేలా కనిపిస్తోంది.

  • 03 Dec 2021 03:34 PM (IST)

    అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం..

    జొవాద్‌ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భీతిగొలుపుతోంది. తీరం వెంబడి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయ్.

  • 03 Dec 2021 03:31 PM (IST)

    సుడులు తిరుగుతూ తీరం వైపు దీసుకొస్తున్న జవాద్‌

    జెట్‌ స్పీడ్‌తో జవాద్‌ వచ్చేస్తోంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి ఇంకా కేవలం 420 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో జొవాద్‌ దూసుకువస్తోంది. మరో ఆరు గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతోపాటు ఒడిషాపై దాడి చేయనుంది.

  • 03 Dec 2021 02:45 PM (IST)

    బలపడిన వాయుగుండం

    నిన్న ఆగ్నేయ బంగాళా ఖతంలో బలపడిన వాయుగుండం ఈరోజు పశ్చిమ మధ్య, పరిసర ప్రాంతాలైన దక్షిణ బంగాళా ఖాతములో తీవ్ర వాయుగుండంగా బలపడినది .

  • 03 Dec 2021 02:44 PM (IST)

    విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలు ఉంటే తెలియచేయండి..

    తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని విద్యుత్ వినియోగదారులకు కీలక ప్రకటనను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ. జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని అందించాలని కోరింది. ఏదైన సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలని తాజా ప్రకటనలో తెలిపింది. తుఫాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని సియండి కె.సంతోషరావు కోరారు.

    కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు ఇవే..

    విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు 9440816373 / 8331018762

    శ్రీకాకుళం 9490612633

    విజయనగరం 9490610102

    విశాఖపట్నం 7382299975

    తూర్పుగోదావరి 7382299960

    పశ్చిమగోదావరి 9440902926

  • 03 Dec 2021 12:38 PM (IST)

    సుమారు 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం..

    ఉత్తరాంధ్రలో మినిమం 7 సెంటీమీటర్ల నుంచి మాగ్జిమమ్‌ 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. ఐఎండీ వార్నింగ్‌ను చూస్తుంటే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రమాదం జరిగేలా కనిపిస్తోంది.

  • 03 Dec 2021 12:37 PM (IST)

    ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చన్న ఐఎండీ

    జొవాద్‌ విధ్వంసం ఏ స్థాయిలో ఉండనుందో ఊహించడం కూడా కష్టమే. ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది.

  • 03 Dec 2021 12:36 PM (IST)

    రాకాసి అలలతో అల్లకల్లోలంగా సముద్రం

    జొవాద్‌ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భీతిగొలుపుతోంది. తీరం వెంబడి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయ్.

  • 03 Dec 2021 12:35 PM (IST)

    గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వస్తున్నజొవాద్‌

    ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో జొవాద్‌ తుఫాన్.. మరో ఆరు గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతోపాటు ఒడిషాపై దాడి చేయనుంది.

  • 03 Dec 2021 12:34 PM (IST)

    సుడులు తిరుగుతూ దూసుకువస్తున్న వాయుగుండం 

    విశాఖ తీరానికి ఇంకా కేవలం 480 కిలోమీటర్ల దూరంలో  జొవాద్ తుఫాన్ .. సుడులు తిరుగుతూ తీరం వైపు  దూసుకువస్తున్న వాయుగుండం

  • 03 Dec 2021 11:31 AM (IST)

    జొవద్ పై ప్రధాని ఆరా ..

    జొవద్ తుఫాన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరా తీస్తున్నారు. 24 గంటలు కంట్రోల్ రూమ్స్ ఉండాలని ఆదేశించారు. మరో 30 ఎన్డీఆర్ఫ్ టీమ్స్ సంసిద్ధంగా ఉన్నాయి.

  • 03 Dec 2021 11:28 AM (IST)

    స్కూల్స్ కు సెలవలు ప్రకటించిన ప్రభుత్వం

    ఉత్తరాంధ్రలో హైఅలర్ట్ ప్రకటించారు.. రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రత్యేక అధికారాలను నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో స్కూల్స్ కు సెలవలు ప్రకటించారు.

  • 03 Dec 2021 10:53 AM (IST)

    నెల్లూరులో వరద నష్టంపై రివ్యూ నిర్వహించనున్న జగన్..

    మధ్యాహ్నం 12గంటలకు బుచ్చిరెడ్డిపాలెంలో... 12:30కి పెనుబల్లి, జొన్నవాడలో... 1:15కి భగత్‌సింగ్ కాలనీ, నెల్లూరులో... 2:15కి దర్గామిట్టలో పర్యటిస్తారు. చివరిగా నెల్లూరులో వరద నష్టంపై రివ్యూ నిర్వహించి మధ్యాహ్నం 3:20కి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు... అక్కడ్నుంచి గన్నవరం బయల్దేరి వెళ్తారు.

  • 03 Dec 2021 10:51 AM (IST)

    కాసేపట్లో నెల్లూరుకి జగన్

    కాసేపట్లో నెల్లూరు జిల్లాకి బయల్దేరి వెళ్లనున్న జగన్.. దేవరపాలెం గ్రామంలో పర్యటించి వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు జగన్

  • 03 Dec 2021 10:45 AM (IST)

    వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది.

    రెండోరోజు ఉదయం చిత్తూరు జిల్లాలో  పర్యటిస్తున్నారు జగన్. తిరుపతి, కృష్ణానగర్‌, ఆటోనగర్‌లో వరద బాధితులతో నేరుగా మాట్లాడారు జగన్.

  • 03 Dec 2021 10:42 AM (IST)

    అల్లకల్లోలంగా బంగాళాఖాతం ..

    బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది.. బలంగా వాయుగుండం కదులుతుండటంతో ఏపీలో భారీ వర్షలు కురుస్తున్నాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు..

  • 03 Dec 2021 10:30 AM (IST)

    గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

    గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో భారీ వృక్షాలు, కరెంట్ స్థంబాలు నేలకూలుతున్నాయి..

  • 03 Dec 2021 10:28 AM (IST)

    కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు అతిభారీ వర్షలు..

    కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు అతిభారీ వర్షలు కురుస్తున్నాయి.. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది..

  • 03 Dec 2021 10:27 AM (IST)

    విశాఖకు 770 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం

    విశాఖకు 770 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యిఉంది..

  • 03 Dec 2021 09:54 AM (IST)

    అవసరాన్ని బట్టి శిబిరాలు ఏర్పాటు చేయాలి : జగన్

    తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి శిబిరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంతి జగన్ అధికారులను ఆదేశించారు.

  • 03 Dec 2021 09:51 AM (IST)

    తుఫాన్ ప్రభావంతో కోనసీమలో మారిన వాతావరణం..

    తుఫాన్ ప్రభావంతో కోనసీమలో వాతావరం మారింది. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రతి మండల కేంద్ర లతోపాటు అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

  • 03 Dec 2021 09:50 AM (IST)

    తుఫాను ప్రభావంతో కోనసీమ రైతులలో గుబులు..

    జావాద్ తుఫాన్ ప్రభావంతో ఆందోళన చెందుతున్న కోనసీమ రైతులు.. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరిచేలు. మళ్ళీ ఇప్పుడు తుఫాన్ ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో కోనసీమ రైతులు..

  • 03 Dec 2021 09:48 AM (IST)

    శనివారం ఉదయం ఒడిశా తీరాన్ని తాకనున్న తుఫాన్ .. 

    శనివారం ఉదయం కోస్తా -దక్షిణ ఒడిశా తీరాన్ని తాకనున్న తుఫాన్ ..

  • 03 Dec 2021 09:45 AM (IST)

    గోపాల్ పూర్ కు 1.020 కిలోమీటర్ల దూరంలో..

    ఓడిశాలోని గోపాల్ పూర్ కు 1.020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉన్న వాయుగుండం..

  • 03 Dec 2021 09:42 AM (IST)

    భారీ నుంచి అతిభారీ వర్షాలు

    సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచన ఉందంటున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

  • 03 Dec 2021 08:33 AM (IST)

    శ్రీకాకుళంలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

    బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృత కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్ బి లాఠకర్ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మత్స్యకారులను 5వ తేదీ వరకూ చేపల వేటకు వెల్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. తుపాన్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి కలెక్టరేట్‌తో పాటు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

    ప్రభుత్వ సిబ్బంది ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతం మత్స్యకారులతో పాటు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అవసరమున్న వారు 08942 240557 నెంబర్లను సంప్రదించాల్సింగా కోరారు. రెవెన్యూ, పోలీస్, మెరైన్ పోలీసులను తీర ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

  • 03 Dec 2021 08:26 AM (IST)

    పర్యాటక ప్రదేశాలకు ఎవరూ రావొద్దు: అధికారుల ప్రకటన.

    జవాద్‌ తుపాన్‌ కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి విశాఖలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యాటకులు ఎవరూ రావొద్దని సూచించారు. తుపాన్‌ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని 5వ తేదీ వరకు పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున తెలిపారు.

  • 03 Dec 2021 08:20 AM (IST)

    తుపాన్‌ నేపథ్యంలో రద్దయిన రైళ్ల వివరాలు..

    03.12.2021 తేదీన..

    18417 పూరి-గుణుపూర్ 20896 భువనేశ్వర్-రామేశ్వరం 12703 హౌరా-సికింద్రాబాద్-ఫలక్ నుమా 22883 పూరీ-యశ్వంత్ పూర్ గరీభీరథ్ 12245 హౌరా-యశ్వంత్ పూర్-దురంతో 11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్ 22605 పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్ 17479 పురీ-తిరుపతి 18045 హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్ 12841 హౌరా-చెన్నై కోరమండల్ 22817 హౌరా-మైసూర్ వీక్లీ 22807 సంత్రగాచ్చి-చెన్నై 22873 డిగా-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ 12863 హౌరా-యశ్వంత్ పూర్ 12839 హౌరా-చెన్నై మెయిల్ 22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ 17244 రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్ 20809 సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్ 18517 కొర్బా-విశాఖ 13351 ధన్ బాద్-అలిప్పీ 12889 టాటా-యశ్వంత్ పూర్ 12843 పూరీ-అహ్మదాబాద్ 18447 భువనేశ్వర్-జగదల్పూర్ 12842 చెన్నై-హౌరా 18046 హైదరాబాద్-హౌరా 12829 చెన్నై-భువనేశ్వర్ 12246 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో 12704 సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా 17480 తిరుపతి-పూరీ 12864 యశ్వంత్ పూర్-హౌరా 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 12840 చెన్నై-హౌరా 18048 వాస్కో-హౌరా 12664 తిరుచురాపల్లి-హౌరా 18464 బెంగళూర్-భువనేశ్వర్ 11019 ముంబై-భువనేశ్వర్ 18518 విశాఖ-కొర్బా 18528 విశాఖ-రాయగఢ్ 17243 గుంటూరు-రాయగఢ్ 18448 జగడల్ పూర్-భువనేశ్వర్ 20838 జునాఘర్ రో డ్-భువనేశ్వర్

    4వ తేదీన రద్దైన రైళ్లు:

    18463 భువనేశ్వర్-ప్రశాంతి నిలయం 18637 హాటీయా-బెంగుళూరు 22819 భువనేశ్వర్-విశాఖ 17015 భువనేశ్వర్-సికింద్రాబాద్ 18418 గుణపూర్-పూరీ 12807 విశాఖ-నిజాముద్దీన్-సమత ఎక్స్ ప్రెస్ 18551 విశాఖ-కిరండోల్ ఇలా.. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

  • 03 Dec 2021 07:43 AM (IST)

    ఒడిశాకు పొంచి ఉన్న ముప్పు..

    తుపాన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో కూడా భారీగా వర్షాలు పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌లకు ఐఎండీ రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీచేసింది. పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరివాహక ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

  • 03 Dec 2021 07:33 AM (IST)

    ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

    తుపాన్‌ ప్రభావంతో నేటి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  • 03 Dec 2021 07:27 AM (IST)

    తుపాన్‌ నేపథ్యంలో మోడీ సమావేశం..

    జవాద్ తుపాన్ తీవ్రత దృష్ట్యా ప్రధాని మోడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అండమాన్‌ తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. గురువారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

    Jawad

     

Published On - Dec 03,2021 7:26 AM

Follow us