Andhra: ఈ జనం చూశారా.. అవతల మనిషి చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే..?
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా, మరోవైపు బోల్తా పడ్డ చేపల లారీ నుంచి చేపలను ఎత్తుకెళ్లిన ఘటన మార్కాపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. త్రిపురాంతకం మండలం దివేపల్లి సమీపంలో చేపల లోడుతో వెళ్తున్న లారీ, ఎదురుగా వచ్చిన బోలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షౌకత్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే… చుట్టుకు నిప్పడిగాడట ఓ ప్రబుద్ధుడు… అలా ఉంది ఈ ఘటన.. రోడ్డు ప్రమాదంలో చేపల లోడు లారీ బోల్తా కొట్టి ఓ వైపు లారీ డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంటే.. మరోవైపు రోడ్డున పడ్డ చేపల కోసం జనం ఎగబడ్డారు. ఇంత ప్రమాదం జరిగి ఒకవైపు ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరిగితే కనీసం మానవత్వం కూడా లేని జనం బోల్తా పడ్డ లారీ నుంచి చేపలను ఎత్తుకెళ్ళారు., ఒకటి కాదు రెండు కాదు కేజీల కేజీల చేపలను గోతాల్లో నింపుకుని మరీ అక్కడి నుంచి జారుకున్నారు.
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దివేపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. చేపల లోడుతో వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న బోలేరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి… అందిన వివరాల ప్రకారం… కడప జిల్లా చెన్నూరు నుంచి మినీలారీలో చేపల లోడుతో కలకత్తా వైపు లారీ దూసుకెళుతోంది… త్రిపురాంతకం మండలం దీవేపల్లి సమీపంలో కర్నూలు వైపు వెళుతున్న బొలెరో వాహనం లారీని ఢీకొట్టింది… ఈ ఘటనలో లారీ డ్రైవర్ షౌకత్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి… క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ షౌకత్ మృతిచెందాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు…
చేపల కోసం ఎగబడ్డ జనం…
చేపల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడిందని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు చేపల కోసం ఎగబడ్డారు… బోల్తాపడిన లారీ నుంచి అందిన కాడికి చేపలను ఎత్తుకెళ్ళారు… రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కూడా తమ వాహనాలను నిలిపి మరీ చేపలను కేజీలకు, కేజీలు గోతాలకు ఎత్తుకెళ్ళారు… లారీలో ఉన్న చేపల పెట్టెలను సైతం ఎత్తుకెళ్ళడం విడ్డూరం… చేపల కోసం తండోపతండాలు జనం ఎగబడి తీసుకెళ్ళడంతో ఆ ప్రాంతం కొద్దిసేపు తిరునాళ్ళను తలపించింది.
Also Read: ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన
