Drug Container: సాగర తీరంలో కంటైనర్ ప్రకంపనలు.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు

విశాఖ చేరిన కంటైనర్ తీరంలో ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. 140 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా అలా ఉంటే కంటైనర్‌లో డ్రగ్స్ లేవని నిరూపించేందుకు తాము సిద్ధమంటోంది సంధ్య ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ.

Drug Container: సాగర తీరంలో కంటైనర్ ప్రకంపనలు.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు
Cocaine Container At Vizag Port
Follow us

|

Updated on: Mar 22, 2024 | 9:22 PM

విశాఖ చేరిన కంటైనర్ తీరంలో ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. 140 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా అలా ఉంటే కంటైనర్‌లో డ్రగ్స్ లేవని నిరూపించేందుకు తాము సిద్ధమంటోంది సంధ్య ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ.

విశాఖ సాగరతీరంలో పట్టుబడిన 25 వేల కేజీల డ్రగ్స్‌ కంటైనర్‌ కేసులో సీబీఐ న్యాయమూర్తి సమక్షంలో నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 140 శాంపిల్స్‌ సేకరించి అందులో ఓపియం, హెరాయిన్, కొకైన్‌ నిర్థారించేందుకు A, B, E పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీబీఐ, కస్టమ్స్‌, నార్కోటిక్ విభాగాలతో పాటు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో టెస్ట్‌లు చేస్తున్నారు. అందులో వచ్చిన రిపోర్ట్ తర్వాత చర్యలు ఉంటాయంటోంది సీబీఐ. ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్‌ డిటెన్షన్‌ పరీక్షలు నిర్వహించిన సీబీఐ అధికారులు కొకైన్‌, హెరాయిన్‌ సహా 100 మాదక ద్రవ్యాల‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే కంటైనర్‌లో ఉన్నది డ్రగ్స్‌ స్టాక్‌ కాదంటోంది సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ యాజమాన్యం.

అసలు ఈ వివాదం ఏంటి? ఏం జరిగిందనే డీటేల్స్‌లోకి వెళ్తే.. బ్రెజిల్‌ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌ విశాఖ తీరానికి చేరింది. అందులో 25 వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇంటర్‌పోల్‌ ఇచ్చిన సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ అండ్‌ కస్టమ్స్‌ అధికారులు అందులో ఉన్న మొత్తాన్ని సీజ్ చేశారు. మరోవైపు కంటైనర్ ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంధ్యా ఆక్వా పరిశ్రమకి చెందినదిగా గుర్తించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కంపెనీని సీజ్ చేసింది.

డ్రగ్స్‌ కలకలంపై సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ వివరణ ఇచ్చింది. బ్రెజిల్‌లో రొయ్యల మేత కోసం ఈస్ట్‌ కొనుగోలు చేశాం, ఆ కంటైనర్‌లో డ్రగ్స్‌ లేవని వివరణ ఇచ్చుకుంది. డ్రగ్స్‌ లేవని నిరూపించేందుకు కూడా తాము సిద్ధమని సంధ్యా ఆక్వా నిర్వాహకులు ప్రకటించారు. అయితే సీబీఐ అధికారులు చేస్తున్న దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆటంకం కల్గించారన్న ఆరోపణలను ఖండించారు విశాఖ సీపీ రవిశంకర్. దర్యాప్తు మొత్తం సీబీఐ ఆధ్వర్యంలోనే సాగుతుందన్న ఎస్పీ.. కస్టమ్స్ సూపరిండెంట్‌ విజ్ఞప్తి మేరకు డాగ్‌ స్క్వాడ్‌ను సమకూర్చినట్లు ప్రకటించారు.

సీబీఐ విచారణ జరుగుతోంది, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కంటైనర్‌లో ఏముందో తేలే వరకు ఎవరు స్పందించవద్దని సూచించారు ఎస్పీ. ఈ సమయంలో తాము ఎన్నికల సంఘానికే జవాబుదారీ అని స్పష్టం చేశారు. ఇదంతా ఇలా ఉంటే సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ యాజమాన్యం ఏ పార్టీకి మద్దతు అనే కోణంలో అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..