కుటుంబంలో తీరని విషాదం.. ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ తల్లి రోదన
అసలే వేసవి కాలం. కొద్ది రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఈతకు వెళ్లి ఉక్కపోత నుంచి సేద తీరుదామనుకున్నారు ఆ అన్నదమ్ములు. మరికొంత మంది...
అసలే వేసవి కాలం. కొద్ది రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఈతకు వెళ్లి ఉక్కపోత నుంచి సేద తీరుదామనుకున్నారు ఆ అన్నదమ్ములు. మరికొంత మంది స్నేహితులను తీసుకుని సరదాగా ఈతకు వెళ్లారు. కాసేపటికే నీటి గుంతలో చిక్కుకుని కానరాని లోకాలకు వెళ్లారు. తమ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామంలో చోటు చేసుకుందీ విషాద సంఘటన. ఈతకు వెళ్లి ఒకే ఇంటిలోని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గ్రామ సమీపంలో ఉన్న తన పొలంలో ఆదోని పట్టణానికి సుభాష్ ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటను తవ్వించాడు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు కుంట నిండింది. దీంతో ఈత కొట్టేందుకు గ్రామానికి చెందిన కిషోర్, సునీల్, మరో ముగ్గురు కుంట వద్దకు వెళ్లారు. మొదట ఇద్దరు అన్నదమ్ములు నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడం, ఈత సరిగ్గా రాకపోవడంతో మునిగిపోయారు. బురద ఎక్కువగా ఉండటంతో పైకి రాలేకపోయారు. ఒడ్డున ఉన్నవారు సమీప పొలంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే కుంటలో దిగి గాలించారు. బురదలో ఇరుక్కున్న ఇద్దరిని బయటికి తీశారు. కిషోర్ అప్పటికే చనిపోయాడు. కొన ఊపిరితో ఉన్న సునీల్ను ఆలూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
తల్లిదండ్రులకు వీరిద్దరే కొడుకులు.. కిషోర్ 15 సంవత్సరాలు సునీల్ 12 సంవత్సరాలు.. ఉన్న ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేదు. అప్పటి వరకు తమ కళ్లముందే ఆడుకున్న పిల్లలు గుంతలో శవాలై తేలడంతో గ్రామం అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: గర్భంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊహించని విషాదం.. దంపతుల దుర్మరణం