Bird Flu: చిత్తూరు జిల్లాపై నెల్లూరు బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. సంక్షోభంలో కోళ్ల పరిశ్రమ..
చిత్తూరు జిల్లాపై నెల్లూరుజిల్లా బర్డ్ ప్లూ ఎఫెక్ట్ పడింది. దీంతో నెల్లూరు జిల్లాకు పక్కనే ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ ఉత్పత్తులు, ఎగుమతుల సంక్షోభానికి కారణం అయ్యింది. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. వారం క్రితం నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రాంతంలో బయట పడ్డ బర్డ్ ఫ్లూ ఇప్పుడు చిత్తూరు జిల్లా పౌల్ట్రీ బిజినెస్ ను కుంగదీసింది.

చిత్తూరు జిల్లాపై నెల్లూరుజిల్లా బర్డ్ ప్లూ ఎఫెక్ట్ పడింది. దీంతో నెల్లూరు జిల్లాకు పక్కనే ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ ఉత్పత్తులు, ఎగుమతుల సంక్షోభానికి కారణం అయ్యింది. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. వారం క్రితం నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రాంతంలో బయట పడ్డ బర్డ్ ఫ్లూ ఇప్పుడు చిత్తూరు జిల్లా పౌల్ట్రీ బిజినెస్ ను కుంగదీసింది. రోజువారీగా బెంగళూరు పాండిచ్చేరి, చెన్నైలకు కోళ్లు, కోడిగుడ్లు ఎగుమతులు చేస్తున్న చిత్తూరు జిల్లాలోని హెచరీస్ సంస్థలు ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లా లోని పౌల్ట్రీ ఉత్పత్తులను అనుమతించని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తీరు ఇబ్బందిగా మారింది. దీంతో బార్డర్ చెక్ పోస్టుల వద్దనే పౌల్ట్రీ రంగం ఉత్పత్తులను రవాణా చేస్తున్న వాహనాలు నిలిచిపోతున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు,7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37, 089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. తాజాగా.. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో.. ఫౌల్ట్రీ వాహనాలను చెక్పోస్టుల దగ్గర అధికారులు నిలిపివేస్తుండటంతో.. రోజుకి రూ.5కోట్ల వ్యాపారం ఆగిపోతోందంటూ ఫౌల్ట్రీ రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా అలెర్ట్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. జిల్లాలో పిపిఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచింది. దాదాపు జిల్లాలో 8 వేల మంది రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడినట్లు చెబుతున్న అధికార యంత్రాంగం.. నెల్లూరు జిల్లా నుంచి కోళ్ల ఎగుమతులను నిషేధించింది. చికిత్స, టీకా లేని బర్డ్ ఫ్లూ ను కేవలం నివారించడం ఒక్కటే మార్గం అంటోంది.
పశువైద్య సిబ్బంది ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజల్లో బర్డ్ ఫ్లూ పై అవగాహన కల్పిస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అలెర్ట్ గా ఉన్నామంటున్నారు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని జిల్లా ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని కోడి మాంసం కోడిగుడ్లు వినియోగించాలంటున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..